‘ఇస్త్రీ పెట్టెపై దోశలు వేసి చూపించిన నాగ్‌’

7 Apr, 2020 15:11 IST|Sakshi

‘క్రికెట్‌లో భారతే గెలుస్తుంది.. ఈ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందో చెప్పలేము.. కానీ ‘నేనున్నాను’  సినిమా మాత్రం సూపర్‌డూపర్‌ హిట్‌ సాధిస్తుంది’అంటూ మార్చి 11, 2004న జరిగిన ‘నేనున్నాను’ ఆడియో ఫంక్షన్‌లో అప్పటి యువసామ్రాట్‌ ఇప్పటి టాలీవుడ్‌ కింగ్‌ నాగార్జున పలికిన మాటలివి. నాగార్జున సరసన శ్రియా, ఆర్తీ అగర్వాల్‌ నటించిన ఈ చిత్రాన్ని విఎన్‌ ఆదిత్య దర్శకత్వం వహించారు. నాగార్జున కెరీర్‌లో మరుపురాని మైలురాయిగా నిలిచిన ఈ చిత్రం ఎన్నో రికార్డులను సొంతం చేసుకుంది. అన్నివర్గాలను ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్‌కు కనెక్ట్‌ అయిన ఈ చిత్రం అనేక సెంటర్లలో వందరోజులు దిగ్విజయంగా పూర్తిచేసుకుంది. కామాక్షి మూవీస్‌పై డి.శివప్రసాద్‌ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం విడుదలై నేటికి 16 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా ఆ చిత్ర విశేషాలు మీకోసం..

సినిమా రిలీజ్‌ కంటే ముందే ఆడియోతో సెన్సేషన్‌ సృష్టించింది ఈ చిత్రం. ఎంఎం కీరవాణి అందించిన పాటలు ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచాయి.  ‘ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమౌతున్నదో’ పాట సంగీత ప్రియుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. వినోదం, పాటలు, ప్రేమ, ఎమోషన్‌ ఇలా అన్ని కలబోసిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. బ్రహ్మానందం, అలీ, శివారెడ్డిల కామెడీ.. నాగార్జున టైమింగ్‌.. శ్రియ, ఆర్తిల అభినయం.. నాగార్జున, శ్రియల కామెడీ అండ్‌ ఎమోషన్‌ సీన్స్‌ వావ్‌ అనిపించేలా ఉంటాయి. ముఖ్యంగా శ్రియ కోసం ఇస్త్రీ పెట్టెపై దోశలు వేసే సీన్‌ అప్పట్లో హాట్‌ టాపిక్‌గా నిలిచింది. మరి ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నారు లాక్‌డౌన్‌ నేపథ్యంలో కుటుంబంతో కలిసి ఇంట్లోనే ఉంటున్నారు కదా అందరూ కలిసి మరోసారి ‘నేనున్నాను’ చూసి కుటుంబసమేతంగా ఎంజాయ్‌ చేయండి. 

మరిన్ని వార్తలు