నందమూరి బాలకృష్ణ జోరు పెంచారు. సినిమా సినిమాకీ గ్యాప్ తీసుకోవడంలేదు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన ‘పైసా వసూల్’ చిత్రానికి బుధవారం గుమ్మడికాయ కొట్టారు. ఒక్కరోజు కూడా విరామం తీసుకోకుండా తన 102వ చిత్రానికి బాలకృష్ణ గురువారం కొబ్బరికాయ కొట్టారు. కేయస్ రవికుమార్ దర్శకత్వంలో సి.కె.ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సి.కల్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రం హైదరాబాద్లో ప్రారంభమైంది.
ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు బి.గోపాల్ కెమెరా స్విచాన్ చేయగా, మరో దర్శకుడు బోయపాటి శ్రీను క్లాప్ ఇచ్చారు. దర్శకుడు క్రిష్ తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. కేయస్ రవికుమార్ మాట్లాడుతూ – ‘‘18ఏళ్ల తర్వాత తెలుగులో నేను దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. బాలకృష్ణగారితో సినిమా చేసేందుకు రెండు, మూడు సార్లు ప్రయత్నించినప్పటికీ ఇప్పటికి కుదిరింది. సి.కల్యాణ్ ఆయన తమ్ముడు వెంకటేశ్వరరావు ఈ సినిమా నిర్మిస్తున్నారు.
ఈ చిత్రం కచ్చితంగా హిట్టవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘రవికుమార్గారికి సినిమా తప్ప వేరే ఆలోచన ఉండదు. గుర్తుండిపోయే సినిమా తీయాలనే పట్టుదలతో ఉన్నారు. రచయిత రత్నం 15 నిమిషాల్లో చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమా చేస్తున్నాం. ఈరోజు నుంచి ఏకధాటిగా షూటింగ్ చేసి 2018 సంక్రాంతికి సినిమా విడుదల చేస్తాం. నయనతార ఓ హీరోయిన్. మరో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు’’ అన్నారు సి. కల్యాణ్. మురళీమోహన్, బ్రహ్మానందం, ప్రకాశ్రాజ్, అశుతోష్ రాణా, ప్రభాకర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సి.రాంప్రసాద్, సంగీతం: చిరంతన్భట్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: సి.వరుణ్, సి.తేజ, సహ నిర్మాత: సి.వి.రావు.