కరోనాపై పోరుకు బాలయ్య విరాళం : చిరు ట్వీట్‌

3 Apr, 2020 12:11 IST|Sakshi

రూ. కోటి 25 లక్షల విరాళం ప్రకటించిన నందమూరి బాలకృష్ణ

సాక్షి, అమరావతి : కరోనా మహమ్మారి కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న తరుణంలో వారిని ఆదుకునేందుకు ప్రముఖులు ముందుకు వస్తున్నారు. తోచినంత విరాళాలు ప్రకటిస్తూ.. ప్రజలకు, ప్రభుత్వాలకు అండగా నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే హిందూపూర్‌ శాససభ్యుడు, ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ తన ఔదార్యాన్ని చాటుకున్నారు. కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు తనవంతుగా రూ.1 కోటి 25 లక్షల రూపాయలను విరాళంగా అందిస్తున్నట్టు ప్రకటించారు.

అందులో 50 లక్షలు ఆంధ్రప్రదేశ్ సీఎం సహయనిధికి, 50 లక్షలు తెలంగాణ సీఎం సహాయనిధికి అందజేస్తున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా ఇబ్బంది పడుతున్న తెలుగు సినీ కార్మికుల సహాయార్థం 25 లక్షల రూపాయల చెక్‌ను కరోనా క్రైసిస్ ఛారిటీ (సీసీసీ) ఎగ్జిక్యూటివ్ మెంబర్ సీ కళ్యాణ్‌కు అందించారు. ఈ సందర్భం గా స్వీయ నిర్బంధంతో  ఇంట్లోనే ఉండి కరోనా విపత్తును ధైర్యంగా ఎదుర్కోవాలని, వైరస్‌ను అరికట్టడంలో ప్రజలంతా భాగంగా కావాలని బాలకృష్ణ పిలుపునిచ్చారు. బాలకృష్ణ విరాళంపై టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవి ట్విటర్‌ వేదికగా అభినందనలు తెలిపారు. కాగా కరోనా బాధితులను ఆదుకునేందుకు, వైరస్‌పై పోరుకు సినీ ప్రముఖులు అనేక మంది ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు