‘‘నిశ్చితార్థం నుంచి పెళ్లి లోపు జరిగే సంఘటనలతో తెరకెక్కిన చిత్రం ‘ఇంతలో ఎన్నెన్ని వింతలో’. ‘100 పర్సంట్ లవ్’ సినిమాలా ఎంటర్టైన్మెంట్ ఎక్కువగా ఉంటుంది. ఈ సినిమా చూశాక నందూతో కమర్షియల్ సినిమాలు చేయొచ్చని చాలామందికి నమ్మకం కలుగుతుంది’’ అని నందు అన్నారు. నందు హీరోగా, సౌమ్య వేణుగోపాల్, పూజ రామచంద్రన్ హీరోయిన్లుగా వరప్రసాద్ వరికూటి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఇంతలో ఎన్నెన్ని వింతలో’. హరహర చలన చిత్ర సమర్పణలో ఎస్. శ్రీకాంత్ రెడ్డి, రామమోహనరావు ఇప్పిలి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 6న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నందు మాట్లాడుతూ– ‘‘అదుర్స్, కృష్ణ, వెంకటాద్రి ఎక్స్ప్రెస్’ చిత్రాలకు వరప్రసాద్ పని చేశారు.
ఆ పంథా కథల్లా ఉండే పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న సినిమా ఇది. ఆయనతో సినిమా చేస్తే ఒక లైఫ్ ఇస్తాడనే నమ్మకం కలిగింది. స్నేహితులు, బంధువులు సినిమా బాగుందనడంతో మంచి సినిమా అనే నమ్మకం బలంగా ఉంది. నా భార్య గీతామాధురి (సింగర్) సినిమా చూసి, ‘మంచి సినిమా చేసావ్. ఇలాంటి కథలే చేయండి’ అంటూ సలహా ఇచ్చింది. మా చిత్రం చూసిన ప్రేక్షకులు ఎక్కడా నిరాశ పడరు. యాజమాన్య మంచి సంగీతం ఇచ్చారు’’ అన్నారు.