జెర్సీలాంటి చిత్రాలు జీవితాంతం గుర్తుండిపోతాయి

24 Apr, 2019 00:01 IST|Sakshi

‘‘చాలా సినిమాలు వస్తుంటాయి.. కొన్ని సినిమాలు చాలా బావుంటాయి. ‘జెర్సీ’ చిత్రం చాలా బావుందని సాధారణ ప్రేక్షకులు, ఇండస్ట్రీ, మీడియా మిత్రులందరూ మెచ్చుకుంటుంటే చాలా సంతోషంగా ఉంది’’ అని నిర్మాత ‘దిల్‌’ రాజు అన్నారు. నాని, శ్రద్ధా శ్రీనాథ్‌ జంటగా గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జెర్సీ’. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా గత శుక్రవారం విడుదలైంది. ఈ సినిమా నచ్చిన ‘దిల్‌’ రాజు హైదరాబాద్‌లో చిత్ర బృందానికి ‘అప్రిషియేషన్‌ మీట్‌’ను (అభినందన) ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ‘దిల్‌’ రాజు మాట్లాడుతూ– ‘‘డబుల్‌ పాజిటివ్‌ నేచర్‌ ఉన్న నానీతో కలిసి ‘జెర్సీ’ చూశా. సినిమా పూర్తవగానే ‘చాలా మంచి సినిమా చేశారు. ప్రేక్షకులు ఏ రేంజ్‌కి తీసుకెళ్తారనేది తెలియాలి’ అని మా నానీతో, వంశీతో చెప్పాను. రిలీజ్‌ రోజు సినిమా చాలా బాగా నచ్చింది. అదేరోజు మధ్యాహ్నం చినబాబుగారు, వంశీ వాళ్ల ఆఫీస్‌కి వెళ్లి ‘మీ టీమ్‌ని అభినందించాలి’ అని చెప్పా. గత ఏడాది ‘మహానటి’ సినిమా చూసి, నేరుగా అశ్వనీదత్‌గారి ఆఫీస్‌కి వెళ్లి అభినందించా. ‘జెర్సీ’ టీమ్‌ని అభినందించడానికి ప్రధాన కారణం గౌతమ్, నాని, వంశీ. జీవితంలో సక్సెస్‌లు, ఫెయిల్యూర్‌లు వస్తాయి.

ఇలాంటి కొన్ని సినిమాలు జీవితాంతం గుర్తుండిపోతాయి. ‘మళ్ళీ రావా’ను చాలా బాగా హ్యాండిల్‌ చేసిన గౌతమ్‌ ‘జెర్సీ’ని తర్వాత స్థాయికి తీసుకెళ్లాడు. నాని అద్భుతమైన నటుడే. తను ఇవాళ గట్టిగా అడిగితే డబ్బు ఇవ్వడానికి ఏ నిర్మాత అయినా రెడీగా ఉంటారు. ఈ సినిమా అల్టిమేట్‌ సక్సెస్‌కి కారణం దర్శకుడు. ఏ సినిమాకైనా సక్సెస్‌ వచ్చిందంటే కారణం టీమ్‌ వర్క్‌. ‘జెర్సీ’ సినిమాను చూడని ప్రతి ఒక్కరూ చూడండి’’ అన్నారు. ‘‘జెర్సీ’ ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌లో నానిగారు మాట్లాడుతున్నప్పుడు ఆయన కాన్ఫిడెన్స్‌ బాగానే అనిపించింది కానీ, ఇంత అంచనాలు పెట్టుకున్నారా? అని  టెన్షన్‌ అనిపించింది. సినిమా విడుదలైన రోజు సాయంత్రానికి ఆ టెన్షన్‌ తీరింది’’ అన్నారు గౌతమ్‌ తిన్ననూరి. నాని మాట్లాడుతూ– ‘‘ఉదయం ఆట చూసి రాజుగారు ఫోన్‌ చేశారంటేనే ఆ సినిమా హిట్‌ అయినట్టు. ఉదయం ఇంటి నుంచి బయలుదేరుతుంటే రాజుగారు ఫోన్‌ చేశారు.. అప్పుడే నాకు రిజల్ట్‌పై క్లారిటీ వచ్చింది. గౌతమ్‌ చాలా పెద్ద డైరక్టర్‌ అవుతాడని నమ్మా. ఇలాంటి సినిమాను నిర్మాతలు నమ్మాల్సిన అవసరం లేదు. అయినా వంశీ చాలా బాగా నమ్మాడు. నేను ప్రతి సినిమా చేసిన తర్వాత ‘ఐదేళ్ల తర్వాత నా సినిమా చూస్తే పాతబడిపోద్దా.. ఎంత పాతబడిపోద్ది’ అనుకునేవాడిని. కానీ నమ్మకంగా చెబుతున్నా. స్టేజ్‌మీద ఉన్న అందరూ పాతబడిపోవచ్చు కానీ ‘జెర్సీ’ ఎప్పటికీ పాతబడిపోదు’’ అన్నారు. శ్రద్ధా శ్రీనాథ్, నటులు బ్రహ్మాజీ, ప్రవీణ్‌ తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు