ఆ అమ్మాయి ఒక్కటే చేసిందంటారా?

7 Mar, 2020 00:16 IST|Sakshi
అనుష్క

‘‘అక్కడ చీకట్లో ఎవరో ఎటాక్‌ చేశారంట.. కానీ ఎవరో ఏంటో కనిపించలేదంటున్నారు’, ‘ఒక ఘోస్ట్‌ ఇదంతా చేసిందని యాక్సెప్ట్‌ చెయ్యడానికి నా సెన్సిబిలిటీస్‌ ఒప్పుకోలేదు’, ‘నిన్న ఆర్ఫనేజ్‌కు వెళ్లిన మాకు చాలా షాకింగ్‌ విషయాలు తెలిశాయి’, ‘ఇదంతా ఓ పాతికేళ్ల అమ్మాయి ఒక్కటే చేసిందంటారా?’... వంటి ‘నిశ్శబ్దం’ చిత్రం ట్రైలర్‌లోని డైలాగులు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. అనుష్క ప్రధాన పాత్రలో హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నిశ్శబ్దం’. క్రితి ప్రసాద్‌ సమర్పణలో టీజీ విశ్వప్రసాద్, కోన వెంకట్‌ నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్‌ 2న తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, ఇంగ్లీష్‌ భాషల్లో విడుదలవుతోంది. ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ను హీరో నాని తన ట్విట్టర్‌ ద్వారా విడుదల చేసి, ‘‘ఇదిగో.. మా స్వీటీ (అనుష్క) స్వీటెస్ట్‌ ‘నిశ్శబ్దం’ ట్రైలర్‌.. సీట్‌ ఎడ్జ్‌ థ్రిల్లర్‌ ఇది’’ అన్నారు.

‘‘ఓ పాడుబడిన ఇంట్లో ఉన్న అనుష్క, మాధవన్‌ కొన్ని భయానకమైన విషయాలను చూస్తారు.. ఆ ఇంట్లో ఏముందోనని పోలీసుల అన్వేషణతో సినిమా నడుస్తుంది. మరో హీరోయిన్‌ అంజలి అమెరికన్‌ పోలీసాఫీసర్‌ పాత్రలో కనపడుతుంది. మాట్లాడలేని, చెవులు వినపడని బధిర అమ్మాయి సాక్షి పాత్రలో నటించిన అనుష్క తన సైగలతో అంజలికి ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తుంటుంది. అసలు అనుష్క బెస్ట్‌ ఫ్రెండ్‌ సోనాలి ఎవరు? దెయ్యం ఇల్లు ఏంటి? అందులో జరిగే కథేంటి?’’ వంటి విషయాలన్నీ తెలియాలంటే ఏప్రిల్‌ 2 వరకూ ఆగాల్సిందే అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. మాధవన్, మైఖేల్‌ మ్యాడసన్, షాలినీ పాండే, సుబ్బరాజు, శ్రీనివాస అవసరాల తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: గోపీ సుందర్, కెమెరా: షానియల్‌ డియో, సహ నిర్మాత: వివేక్‌ కూచిభొట్ల.

మరిన్ని వార్తలు