ఎవరికీ ప్రేమలేఖ?

31 Aug, 2016 00:01 IST|Sakshi
ఎవరికీ ప్రేమలేఖ?

 ‘‘నీ కోసం ఎంత దూరమైనా నడుస్తా.. ఎన్ని సముద్రాలైనా ఈదుతా.. ఎన్ని ఆకాశాలైనా దాటుతా.. ఎందుకంటే, నిన్ను చూసిన రోజే నేను మళ్లీ పుట్టాను. ఆ రోజు నుంచి నాకు నేను కొత్తగా ఉన్నాను. నీ చిరునవ్వే నాకు ఆహారం.. నీ మాటే నాకు సంగీతం..’’ ప్రేమలేఖ రాసుకుంటూ వెళ్తున్నాడో యువకుడు. మరి, ప్రేయసి స్పందన ఏంటో? తెలుసుకోవాలంటే ‘మజ్ను’ సినిమా చూడాలి. నాని హీరోగా విరించి వర్మ దర్శకత్వంలో పి.కిరణ్, గీత నిర్మించిన సినిమా ‘మజ్ను’.
 
 అనూ ఇమ్మాన్యుయేల్, ప్రియాశ్రీ హీరోయిన్లు. ఈ సెప్టెంబర్ 4న ఆడియో, 16న సినిమా విడుదల చేయనున్నారు. ‘‘యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ఇది. హీరోయిన్లు ఇద్దరిలో హీరో ప్రేమలేఖ ఎవరికి రాశాడనేది ఆసక్తికరం. ప్రముఖ దర్శకుడు రాజమౌళి ఈ చిత్రంలో అతిథి పాత్రలో కనిపిస్తారు. అది ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ’’ అన్నారు నిర్మాతలు. ‘వెన్నెల’ కిశోర్, సత్యకృష్ణ, పోసాని, సప్తగిరి తదితరులు నటించిన ఈ చిత్రానికి కూర్పు: ప్రవీణ్ పూడి, కెమేరా: జ్ఞానశేఖర్, సంగీతం: గోపీసుందర్.