నాని అ!

26 Nov, 2017 00:25 IST|Sakshi

హీరో నాని నిర్మాతగా మారారు. ఆ సినిమా పేరు ‘అ!’. ప్రపంచంలో నేను... నాలోని ప్రపంచం... అనేది ఉపశీర్షిక. ట్విస్ట్‌ ఏంటంటే... ఇందులో నాని నటించడం లేదు. నిత్యా మీనన్, శ్రీనివాస్‌ అవసరాల, రెజీనా, ప్రియదర్శి, ఈషా రెబ్బా, మురళీ శర్మ, కాజల్‌ అగర్వాల్‌ తదితరులు ముఖ్య తారలు. రవితేజ, నానిలు వాయిస్‌ ఓవర్‌ ఇస్తున్నారు. ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో నాని సమర్పణలో వాల్‌పోస్టర్‌ సినిమా పతాకంపై ప్రశాంతి త్రిపురనేని నిర్మించనున్న ‘అ!’ టైటిల్‌ లోగో, నటీనటుల వివరాలను నిన్న సాయంత్రం విడుదల చేశారు.

‘‘ఈ ఏడాది ప్రారంభంలో ప్రశాంత్‌ నా దగ్గరకు వచ్చి ఓ కథ చెప్పాడు. అందులోని చిన్న పాత్రకు నన్ను వాయిస్‌ ఓవర్‌ ఇవ్వమని అడిగాడు. కథ కొత్తగా, విభిన్నంగా ఉంది. ఇంతకు ముందు తెలుగు ప్రేక్షకులెప్పుడూ ఇటువంటి కథను పెద్ద తెరపై చూడలేదనిపించింది. సరైన టీమ్, సపోర్ట్‌ ఇటువంటి ఐడియాకి అవసరమని భావించి... ‘ఎవరు ప్రొడ్యూస్‌ చేస్తున్నారు ప్రశాంత్‌?’ అనడిగా. ‘ఇంకా తెలీదు భయ్యా... ఎలాగోలా మేనేజ్‌ చేస్తా’ అన్నాడు. ‘మేనేజ్‌ చేసే సినిమా కాదిది. సరిగ్గా, బాగా చేయాలి’ అన్నాను.

తర్వాత ‘ఇలాంటి ఐడియాను నేనే ఎందుకు ప్రొడ్యూస్‌ చేయకూడదు?’ అన్పించి, క్షణం కూడా ఆలస్యం చేయకుండా ప్రశాంత్‌కి ‘నేనే ప్రొడ్యూస్‌ చేస్తా’ అని చెప్పాను. నేను దిగిన తర్వాత బోల్డంత మంది ఆర్టిస్టులు, ఎంతోమంది టెక్నీషియన్లు, ప్రశాంతి... వీళ్లందరూ కథ విని, నచ్చి, ఎంతో ఇన్వాల్వ్‌ అయ్యి సినిమా చేస్తున్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్‌ 80 పర్సెంట్‌ సినిమా రెడీ. వచ్చే ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం’’ అని అంతకు ముందు నాని పేర్కొన్నారు. అదండీ సంగతి!!

మరిన్ని వార్తలు