డైరెక్టర్‌ కాబోయి యాక్టర్‌ అయ్యా

23 Dec, 2016 23:35 IST|Sakshi
డైరెక్టర్‌ కాబోయి యాక్టర్‌ అయ్యా

‘డాక్టర్‌ కాబోయి యాక్టర్‌ అయ్యా’ అని సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ మంది అంటుంటారు. అయితే శ్రీవిష్ణు దీన్నే మరోలా అంటున్నారు. ‘డైరెక్టర్‌ కాబోయి యాక్టర్‌ అయ్యా’ నని! నారా రోహిత్, శ్రీ విష్ణు, తాన్యా హోప్‌ ముఖ్య తారలుగా సాగర్‌ కె.చంద్ర దర్శకత్వంలో ఆరన్‌ మీడియా వర్క్స్‌ పతాకంపై ప్రశాంతి, కృష్ణ విజయ్‌ నిర్మించిన చిత్రం ‘అప్పట్లో ఒకడుండేవాడు’. ఈ సినిమా ఈ నెల 30న విడుదలవుతోంది. శ్రీవిష్ణు మాట్లాడుతూ– ‘‘నేను చిత్ర పరిశ్రమలోకి వచ్చి పదకొండేళ్లవుతోంది. నాకున్న మొహమాటానికి యాక్టర్‌ అవుతానని ఊహించలేదు. కానీ, అయ్యాను. 1990లో జరిగిన వాస్తవ సంఘటన ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది.

దేశాన్నే వణికించిన ఐదారు అంశాలు ఇందులో ఉంటాయి. ఒక క్రికెటర్, ఓ పోలీసాఫీసర్‌ మధ్య జరిగిన కథే ఈ చిత్రం. ఇందులో క్రికెటర్‌ రైల్వే రాజు పాత్రలో నటించాను. ఉద్యోగం కోసం ఏదైనా చేయడానికి వెనకాడని ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌ పాత్రను నారా రోహిత్‌ చేసారు. ఈ సినిమా నటుడిగా నాకు మంచి పేరు తెచ్చిపెడుతుందనే నమ్మకం ఉంది. ప్రస్తుతం ‘నీది నాది ఒకే ప్రేమకథ’ అనే చిత్రంలో సోలో హీరోగా చేస్తున్నా. అలాగే వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో చేయనున్న ‘మెంటల్‌ మదిలో’ చిత్రం జనవరిలో ప్రారంభమవుతుంది’’ అన్నారు.