ఈ నెలలో మార్కెట్‌లో ప్రజాస్వామ్యం

10 May, 2019 03:24 IST|Sakshi
ఆర్‌. నారాయణమూర్తి

‘‘గ్రేట్‌ మ్యాన్‌ అబ్రహం లింకన్‌ ప్రజాస్వామ్యం గురించి గొప్ప నిర్వచనం ఇచ్చారు. ప్రజాస్వామ్యం అంటే ఫర్‌ ద పీపుల్, బై ద పీపుల్, టు ద పీపుల్‌ అని చెప్పారు. ప్రస్తుత రాజకీయ వ్యవస్థలో అది మరో రకంగా రూపాంతరం చెందింది.  అదెలాగంటే ఫర్‌ ద పీపుల్‌ ఫార్‌ ఎవే ద పీపుల్, బై ద పీపుల్‌ అంటే బైయింగ్‌ ద పీపుల్, టూ ద పీపుల్‌ కాస్త టార్చరింగ్‌ ద పీపుల్‌గా రూపాంతరం చెందింది’’ అంటున్నారు పీపుల్స్‌ స్టార్‌ ఆర్‌. నారాయణమూర్తి. స్నేహచిత్ర పతాకంపై ఆయన స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మార్కెట్‌లో ప్రజాస్వామ్యం’. షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటుంది.

త్వరలోనే ఫస్ట్‌ కాపీని సిద్ధం చేసుకుని సెన్సార్‌కి వెళతాను అంటున్నారాయన. ఈ నెలలోనే సినిమా విడుదల జరుపుకుంటుందని ఆయన తెలిపారు. ఇంకా నారాయణమూర్తి మాట్లాడుతూ–‘‘యం ఎల్‌ ఏ, యంపీ లుగా ఎలక్షన్‌లలో పోటీ చేయాలంటే 25 నుండి 50 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారు. వారు ఆ డబ్బును ఖర్చు చేసి, మళ్లీ ఆ డబ్బును సంపాదించే ఆదాయ మార్గాలను వెతుకుతున్నారు. రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయటానికా? ప్రజలతో వ్యాపారం చేయటానికా? ఒక పార్టీ గుర్తుపై పోటీచేసి, గెలిచిన తర్వాత వేరే పార్టీలోకి ఫిరాయించే వాళ్లందరికీ బుద్ధి వచ్చేలాగా నా సినిమా ఉంటుంది. ఇదే మా సినిమాలో చూపించబోతున్నాం’’ అన్నారు.

మరిన్ని వార్తలు