మానవతా విలువలకు పట్టం

18 Jun, 2014 01:19 IST|Sakshi
మానవతా విలువలకు పట్టం

 అంతరించిపోతున్న సంస్కృతీ సంప్రదాయాలను, సన్నగిల్లుతున్న బాంధవ్యాలను తిరిగి స్వాగతించడమే ప్రధానాంశంగా తెరకెక్కిన చిత్రం - ‘పరంపర’. నరేశ్, ఆమని జంటగా నటించిన ఈ చిత్రాన్ని రూపాదేవి మహంకాళితో కలిసి మధు మహంకాళి స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. నిర్మాణంలో ఉన్న ఈ సినిమా గురించి నిర్మాతలు మాట్లాడుతూ -‘‘మహోన్నతమైన మానవతా విలువల నేపథ్యంలో సాగే కథాంశమిది. తెలుగు తెరపై ఇప్పటివరకూ ఇలాంటి ప్రయత్నం రాలేదని నమ్మకంగా చెప్పగలం.
 
 ఆర్ష సంప్రదాయానికి పూర్వవైభవం తేవడమే పరమావధిగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది. ఇందులో నరేశ్, ఆమని పోటీ పడి నటించారు. అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసి త్వరలోనే సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. రావి కొండలరావు, సంతోష్, మనీషా, మాస్టర్ సాయితేజ తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: ప్రసన్న జైన్, సంగీతం: అర్జున్, కూర్పు: పరేష్ కాందార్, పాటలు: రాణి పులోమజాదేవి, నిర్మాణం: ధృతి మీడియా ప్రై. లిమిటెడ్.