‘ఆమె గొంతు వినగానే ఏడుపు ఆపుకోలేకపోయాను’

14 Jul, 2018 20:47 IST|Sakshi
తల్లి నర్గీస్‌ దత్‌తో సంజయ్‌ దత్‌ (ఫైల్‌ ఫోటో)

బాలీవుడ్‌ స్టార్‌ సంజయ్‌ దత్‌ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘సంజు’. రణ్‌బీర్‌ కపూర్‌ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం విడుదలై మంచి వసూళ్లతో ముందుకు దూసుకుపోతున్న విషయం తెలిసిందే. సంజయ్‌కు చాలా మంది అమ్మాయిలతో సంబంధం ఉందనే విషయం అందరికి తెలిసిందే. స్వయంగా సంజయ్‌ దత్తే ఈ విషయం గురించి చెప్పారు. మా అమ్మ చనిపోయిందని చెప్పి అమ్మాయిల దగ్గర సానుభూతి పొంది వారికి దగ్గరయ్యేవాడినని సంజయే స్వయంగా ఒప్పుకున్నారు.

అయితే నిజ జీవితంలో మాత్రం తన తల్లి నర్గీస్‌ దత్‌ చనిపోయినప్పుడు సంజయ్‌కు కన్నీళ్లు రాలేదంట. అసలు ఆ సమయంలో అతనికి ఎటువంటి ఫీలింగ్‌ కలగలేదంట. కానీ ఆమె చివరి రోజుల్లో ఆస్పత్రిలో ఉండగా తన కోసం పంపించిన మెసేజ్‌ను విన్నప్పుడు కన్నీళ్లు ఆగలేదన్నారు సంజయ్‌. ఈ విషయం గురించి సంజయ్‌ మా అమ్మ నర్గీస్‌ ఎన్‌వై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో నా కోసం ఒక సందేశాన్ని రికార్డు చేసి పంపించారు.

దానిలో నా గురించి మా అమ్మ ‘సంజు అన్నింటి కంటే ముఖ్యమైనది వినయం. నీ వ్యక్తిత్వాన్ని నిలుపుకో, దాన్ని కోల్పోకు. పెద్దలను గౌరవిస్తూ, ఒదిగి ఉండూ. అదే నిన్ను కాపాడుతుంది, అదే నీకు బలం’ అని తెలిపారు. ఆ సందేశం వినగానే నన్ను నేను నియంత్రించుకోలేక పోయాను. మా అమ్మ మరణించినప్పుడు కూడా నాకు ఏడుపు రాలేదు. కానీ మా అమ్మ మరణించిన తర్వాత ఆమె గొంతు విన్న నాకు ఏడుపు ఆగలేదు. అలా 4,5 గంటల పాటు ఏడుస్తునే​ ఉన్నాను అని తెలిపారు.

నర్గీస్‌ మరణించిన తర్వాత సంజయ్‌ డ్రగ్స్‌కు బానిసయ్యారు. ఆ వ్యసనం నుంచి బబయటపడేందుకు అమెరికాలోని రిహబిలిటేషన్‌ సెంటర్‌లో చేర్చారు. ఆ సమయంలో సునీల్‌ దత్‌ ఈ టేప్‌లను సంజయ్‌ దగ్గరకు తీసుకువచ్చారు. ఆ టేప్‌లలో ఏముందో సునీల్‌ దత్‌కు కూడా తెలియదంటా. ఆయన వాటిని ప్రెస్‌ చేయగానే ఆ గదిలో ఒక్కసారిగా నర్గీస్‌ గొంతు ప్రతిధ్వనించిందంట. తల్లి గొంతు విన్న సంజయ్‌ తనను తాను నియంత్రించుకోలేక పోయారంటా. అన్నాళ్లు మనసులో గూడు కట్టుకుపోయిన బాధ ఒక్కసారిగా బయటకు వచ్చి అలా ఏడుస్తూనే ఉన్నారంటా.

ఇదంతా నర్గీస్‌ చనిపోయిన మూడేళ్ల తర్వాత జరిగింది. సంజయ్‌ ఈ విషయం గురించి చెప్తుండగా తీసిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. నర్గీస్‌ 1981లో క్యాన్సర్‌తో బాధపడుతూ చనిపోయారు. ఆమె మరణం తర్వాతే సంజయ్‌ డ్రగ్స్‌కు బానిసయ్యారు.

మరిన్ని వార్తలు