-

ఆ గౌరవం వద్దు

30 Apr, 2018 01:59 IST|Sakshi
నటాలీ పోర్టమన్‌

హాలీవుడ్‌ స్పైస్‌

‘మీటూ’ ఉద్యమంలో భాగంగా చాలామంది హీరోయిన్లలానే తనకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి నటాలీ పోర్టమన్‌ చెప్పిన ‘నేను చెప్తే అలాంటివి వంద కథలుంటాయి.’ అన్న మాటలు అందరినీ కలిచివేశాయి. ‘మీటూ’ తర్వాత ఆమె, తను తీసుకునే నిర్ణయాల్లో సామాజిక బాధ్యతను మర్చిపోకూడదనుకుంటున్నారు. తాజాగా ఈ క్రమంలో ఇజ్రాయిల్‌ ప్రభుత్వం అందించే ప్రెస్టీజియస్‌ అవార్డును కూడా కాదనుకుంది నటాలీ. ఇజ్రాయిల్‌ పౌరసత్వాన్ని కలిగిఉన్న నటాలీని అక్కడి ప్రభుత్వం జెనెసిస్‌ ప్రైజ్‌ అవార్డుకు ఎంపిక చేసింది. అయితే తాజాగా ఆమె ఆ అవార్డును అందుకునేందుకు నిరాకరించింది.

దీనిపై సోషల్‌ మీడియాలో బాగా విమర్శలు, వాదనలు వినిపించడంతో స్వయంగా నటాలీ ఎందుకు తాను ఈ అవార్డు తీసుకోలేదో తెలియజేసింది. ప్రస్తుతం ఇజ్రాయిలీ  పాలస్తీనియన్‌ సంక్షోభం తారాస్థాయికి చేరిపోయింది. ఇజ్రాయిల్‌ ప్రభుత్వం కాల్పుల్లో పాలస్తీనియన్లను కాల్చి చంపినట్టు వచ్చిన వార్తలతో ప్రభుత్వంపై విమర్శలు కూడా తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో తాను ఈ అవార్డు తీసుకుంటే అది ఇజ్రాయిల్‌ ప్రభుత్వాన్ని, దాని చర్యలను సమర్థించినట్టు అవుతుందన్న కారణంతో నటాలీ ఈ అవార్డు అందుకోవడానికి దూరం జరిగింది. ఆమె తీసుకున్న డిసిషన్‌పై ఎప్పట్లానే రెండు రకాల వాదనలూ వినిపిస్తున్నాయి! ఆస్కార్‌ అవార్డ్‌ విన్నింగ్‌ స్టార్‌ అయిన నటాలీ, ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ వెళుతోంది.

మరిన్ని వార్తలు