న్యాయం చేస్తా

16 Aug, 2018 05:26 IST|Sakshi
సి. కల్యాణ్‌

సినీ రంగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సినీ వర్కర్స్‌ వెల్ఫేర్‌ ఫండ్‌ కమిటీ నియామకం జరిగింది. ఈ కమిటీ చైర్మన్‌గా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జయప్రకాశ్‌ నారాయణ్‌ వల్లూరు నియమితులయ్యారు. దేశవ్యాప్తంగా వివిధ వర్గాలకు చెందిన 20మంది సభ్యులతో ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో తెలుగు సినిమా రంగం నుంచి నిర్మాత సి. కల్యాణ్‌ ఓ కమిటీ మెంబర్‌గా స్థానం సంపాదించారు. ఆర్టికల్‌ 33,1984 ప్రకారం కేంద్ర ప్రభుత్వ కార్మిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ కమిటీ పని చేస్తుందని, జూలై 31న ఈ కమిటీ నియామకం పూర్తయిందని సి. కల్యాణ్‌ తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన బుధవారం విలేఖరులతో మాట్లాడుతూ– ‘‘దేశవ్యాప్తంగా ఎంతో పోటీ ఉన్నా ఒక తెలుగు వ్యక్తికి అవకాశం ఇవ్వటం చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో పనిచేస్తున్న ప్రతి కార్మికునికి న్యాయం జరిగేలా చూస్తాను. ముఖ్యంగా ఆరోగ్య బీమా, జీవిత బీమా చాలా ముఖ్యం. ఈ నెల 17న ‘ఝాన్సీ’ సినిమా, 24వ తేదిన ‘లక్ష్మీ’ చిత్రాలు మా సంస్థ నుండి విడుదలవుతున్నాయి. ఆ సినిమాలు విజయవంతమవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అన్నారు.

మరిన్ని వార్తలు