నవాజుద్దీన్‌ సిద్దిఖీకి విడాకుల నోటీసులు

19 May, 2020 08:06 IST|Sakshi

ముంబై: బాలీవుడ్‌ విలక్షణ నటుడు నవాజుద్దీన్‌ సిద్ధిఖీ నుంచి విడాకులు కోరుతూ అతడి భార్య అలియా సిద్దిఖీ లీగల్‌ నోటీసులు పంపించారు. కోవిడ్‌-19 కారణంగా లాక్‌డౌన్‌ అమల్లో ఉన్న నేపథ్యంలో ఇ-మెయిల్‌, వాట్సాప్‌ల ద్వారా ఈ మేరకు మే 7న నోటీసులు పంపినట్లు అలియా తరఫు లాయర్‌ అభయ్‌ తెలిపారు. విడిపోయిన అనంతరం అలియాకు చెల్లించాల్సిన భరణం గురించి కూడా ఇందులో ప్రస్తావించినట్లు పేర్కొన్నారు. నవాజుద్దీన్‌, ఆయన కుటుంబంపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయని... లీగల్‌ నోటీసులకు నవాజుద్దీన్‌ ఇంతవరకు స్పందించ లేదని తెలిపారు.(రెండు వారాల పాటు క్వారంటైన్‌లో నటుడు) 

కాగా పవిత్ర రంజాన్‌ మాసం సందర్భంగా మే 12న నవాజుద్దీన్‌ ముంబై నుంచి స్వస్థలం బుధానా(ఉత్తరప్రదేశ్‌)కు వెళ్లారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో లాక్‌డౌన్‌ నిబంధనల ప్రకారం అతడిని 14 రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా అధికారులు సూచించారు. ఈ విషయం గురించి నవాజుద్దీన్‌ మాట్లాడుతూ.. నిబంధనల మేరకు తమ కుటుంబమంతా నిర్బంధంలోనే ఉంటామని, ఎవరినీ కలిసే ప్రయత్నం చేయమని స్పష్టం చేశారు. ఇక సొంతింటికి చేరుకున్న అనంతరం.. ‘‘ మా చెల్లి మరణించిన తర్వాత మా అమ్మ అనారోగ్యం పాలైంది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం బుధానాలో మేం హోంక్వారంటైన్‌లో ఉంటాం’’ అని సోమవారం ట్వీట్‌ చేశారు. కాగా నవాజుద్దీన్‌, అలియా 2009లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు సంతానం. నవాజుద్దీన్‌ గతంలో షీబాను పెళ్లి చేసుకుని ఆమె నుంచి విడిపోయిన సంగతి తెలిసిందే. (వలస కార్మికుల కోసం సోనూసూద్.. హ్యాట్సాఫ్‌)

మరిన్ని వార్తలు