మరో హర్రర్‌ చిత్రంలో..

29 Mar, 2018 06:21 IST|Sakshi

తమిళసినిమా: మరో హర్రర్‌ కథా చిత్రంలో నటించడానికి నటి నయనతార రెడీ అవుతున్నారా? అవుననే టాక్‌ వినిపిస్తోంది. ఈ తారను లేడీ ఓరియెంటెడ్‌ కథా చిత్రాల నాయకిగా మార్చిన చిత్రం మాయ. ఇది హర్రర్‌తో కూడిన మిస్టరీ కథా చిత్రం. సంచలన విజయం సాధించిన ఈ చిత్రం తరువాత నయనతార రేంజే మారిపోయిందని చెప్పాలి. అయితే ఆ తరువాత నటించిన డోర చిత్రం నిరాశపరచినా, నయనతార కెరీర్‌కు పెద్దగా ఎఫెక్ట్‌ కాలేదు.

ఇక ఈ మధ్య నటించిన అరమ్‌ చిత్రం నయనతారకు లేడీ సూపర్‌స్టార్‌ స్థాయినే తెచ్చిపెట్టింది. దీంతో  కోలీవుడ్‌లో నయనతారకు ఆ తరహా లేడీ ఓరియెంటెడ్‌ కథా చిత్రాలు వరుస కడుతున్నాయి. ఇప్పటికే కొలమావు కోకిల, కొలైయుధీర్‌ కాలం,  అరివళగన్‌ దర్శకత్వంలో చిత్రం అంటూ నటిస్తున్న నయనతార తాజాగా మరో హర్రర్‌ మిస్టరీ కథా చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్నారని తెలిసింది.

బాలీవుడ్‌లో సంచలన నటి అనుష్కశర్మ కథానాయకిగా నటించి సొంతంగా నిర్మించిన పరి అనే హర్రర్‌ కథా చిత్రం ఇటీవల తెరపైకి వచ్చి సక్సెస్‌ఫుల్‌గా ప్రదర్శింపబడుతోంది. దీనికి  ప్రాజిట్‌రాయ్‌ దర్శకుడు. ఆయనిప్పుడు పరి చిత్రాన్ని తమిళంలో రీమేక్‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని, ఇందులో నయనతారను అనుష్కశర్మ పాత్రలో నటింపజేసే పనిలో ఉన్నట్లు సమాచారం. 

ఇదే విధంగా ఇప్పటికే  హిందీలో మంచి విజయాన్ని సాధించిన తుమ్హారి సులు చిత్రం తమిళంలో రీమేక్‌ కానున్న విషయం తెలిసిందే. హిందీలో నటి విద్యాబాలన్‌ పోషించిన పాత్రలో జ్యోతిక నటించడానికి రెడీ అవుతున్నారు. దీనికి రాధామోహన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇలా మన కథానాయికలు హిందీ చిత్రాల రీమేక్‌లపై ఆసక్తి చూపుతున్నారని చెప్పవచ్చు.

మరిన్ని వార్తలు