భారీగా ఇస్తాం నటించవా ప్లీజ్‌!

19 Jun, 2017 02:55 IST|Sakshi
భారీగా ఇస్తాం నటించవా ప్లీజ్‌!

కావాలంటే పారితోషికాన్ని భారీగానే ముట్టజెబుతాం.అని నయనతారను దర్శక నిర్మాతలు బ్రతిమలాడుతున్నారట. ఇది నిజమేనా? సంగతేమిటంటే సంఘమిత్ర చిత్రానికింకా నాయకి దొరకలేదట. శ్రీతేనాండాళ్‌ ఫిలింస్‌ సంస్థ నిర్మించితలపెట్టిన భారీ చారిత్రాత్మక కథా చిత్రం సంఘమిత్ర. సుందర్‌.సీ కథ, కథనం,దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్న ఈ చిత్రంలో కథానాయకులను ఎంపిక చేయడానికి చాలానే తర్జన భర్జనలు పడాల్సి వచ్చింది. విజయ్, అజిత్, టాలీవుడ్‌ స్టార్‌ నటుడు మహేశ్‌బాబు వరకూ చర్చలు జరిగాయి. వారందరూ కథ బ్రహ్మాండం అన్నారే కానీ, అందులో నటించడానికి సాహసించలేదు.

అందుకు వారు చెప్పిన కారణం రెండేళ్ల పాటు సంఘమిత్ర కోసం కాల్‌షీట్స్‌ను కేటాయించలేమన్నదే. ఎట్టకేలకు జయంరవి, ఆర్య కథానాయకులుగా సెట్‌ అయ్యారు. ఇక కథానాయకి ఎంపికకు అదే పరిస్థితి. నటి శ్రుతీహాసన్‌ నటించడానికి సమ్మతించి చివరి క్షణంలో వైదొలిగారు. ఇది పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారం సద్దుమణిగినా నాయకి ఎవరన్నది ప్రశ్నగానే మారింది. బాహుబలి ఫేమ్‌ అనుష్కను నటింపజేసే ప్రయత్నం జరిగింది. తను ఇప్పటికే బాహుబలి చిత్రం కోసం రెండేళ్లకు పైగా సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. మళ్లీ అన్ని కాల్‌షీట్స్‌తో తానీ చిత్రం చేయలేనని చేతులెత్తేసినట్లు సమాచారం.

దీంతో దర్శకుడు సుందర్‌.సీ.తన ఆస్థాన కథానాయకి హన్సిక పేరును సిఫారసు చేసినా, నిర్మాత అందుకు సమ్మతించలేదనే టాక్‌ స్ప్రెడ్‌ అయ్యింది. ఒక దశలో బాలీవుడ్‌ భామను నటింపజేసే ఆలోచన జరిగిందట. అదీ వర్కౌట్‌ కాకపోవడంతో నటి నయనతారపై దృష్టిసారించినట్లు తాజా సమాచారం.అయితే ఈ టాప్‌ హీరోయిన్‌ చేతి నిండా చిత్రాలతో చాలా బిజీగా ఉన్నారు. అయినా భారీ పారితోషికం ముట్టజెబుతాం సంఘమిత్రలో రాణి కావాలంటూ బ్రతిమలాడే ధోరణికి దిగారని సోషల్‌ మీడియాలో తాజాప్రచారం. కాగా తాను ఇప్పటికే అంగీకరించిన చిత్రాలకు ఎలాంటి ఇబ్బంది కలగని రీతిలో కాలషీట్స్‌ కోరితే సంఘమిత్రలో నటించడానికి రెడీ అని నయనతార అన్నట్లు లేటెస్ట్‌ న్యూస్‌. ఏదేమైనా ఈ విషయంలో క్లారిటీ రావడానికి మరి కొంత సమయం పడుతుందని చెప్పవచ్చు.