నయన నో.. అమలాపాల్‌ ఎస్‌

17 Mar, 2017 03:47 IST|Sakshi
నయన నో.. అమలాపాల్‌ ఎస్‌

నటి నయనతార నో అన్న అవకాశానికి అమలాపాల్‌ ఎస్‌ అన్నారన్నది తాజా సమాచారం. దర్శకుడు ఏఎల్‌.విజయ్‌ నుంచి విడాకులు పొందిన తరువాత నటి అమలాపాల్‌కు అవకాశాలు వరుస కడుతున్నాయి. భర్త నుంచి విడిపోయిన తరువాత నటనపై దృష్టి పెట్టిన అమలాపాల్‌కు నటుడు ధనుష్‌ స్నేహహస్తం అందించారు.తాను నిర్మించిన అమ్మాకణక్కు చిత్రంలో ప్రధాన పాత్ర పోషించే అవకాశం కల్పించారు. అంతకు ముందే వీరిద్దరూ కలిసి నటించిన వేలై ఇల్లా పట్టాదారి చిత్రం మంచి విజయం సాధించడంతో ఈ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న వేలై ఇల్లా పట్టాదారి–2లోనూ ధనుష్, అమలాపాల్‌ జంటగా నటిస్తున్నారు.

అంతే కాదు ఆయన కథానాయకుడిగా నటిస్తున్న వడచెన్నై చిత్రంలోనూ ఈ మలయాళీ అమ్మడే నాయకి. వీటితో పాటు తిరుట్టిప్పయలే–2లోనూ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మలయాళంలో మమ్ముట్టి, నయనతార జంటగా నటించిన భాస్కర్‌ ది రాస్కెల్‌ తమిళ రీమేక్‌లో నయనతార పాత్రను పోషించనున్నారు. సిద్ధిక్‌ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం షూటింగ్‌ ఇదే నెలలో ప్రారంభం కానుంది. ఇలా చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్న నటి అమలాపాల్‌కు తాజాగా మరో అవకాశం తలుపు తట్టినట్లు తాజా సమాచారం.

వినోద్‌ అనే నూతన దర్శకుడు నేటి టాప్‌ హీరోయిన్‌ నయనతారను దృష్టిలో పెట్టుకుని ఒక యాక్షన్‌ ఓరియెంటెడ్‌ కథా చిత్రాన్ని తయారు చేసుకున్నారు.అయితే కారణాలేమైనా ఈ చిత్రంలో నటించడానికి నయనతార నో చెప్పారట. దీంతో అమలాపాల్‌ను సంప్రదించగా తను ఒకే చెప్పినట్లు కోలీవుడ్‌ వర్గాల సమాచారం. ఈ తాజా చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారకపూర్వకంగా త్వరలో వెలువడే అవకాశం ఉన్నట్లు తెలిసింది.

>