పనీపాటా లేనివాళ్లు చేసే నిర్వాకం ఇది

13 Aug, 2013 23:32 IST|Sakshi
పనీపాటా లేనివాళ్లు చేసే నిర్వాకం ఇది
‘‘గాయాలతో నా హృదయం శిలగా మారింది. ఇక మీరు నాపై ఎన్ని గాసిప్పుల తూటాలు పేల్చినా నాకు బాధ అనిపించదు’’ అని మీడియాను ఉద్దేశించి అన్నారు నయనతార. ఇంతకు ఈ కేరళ కుట్టీకి ఇంత ఉద్వేగంగా మాట్లాడాల్సిన అవసరం ఎందుకొచ్చిందా అనుకుంటున్నారా? అయితే వివరాల్లోకెళ్దాం. దక్షిణాది హీరోయిన్లందరూ బాలీవుడ్ వైపు చూస్తుంటే... నయనతార మాత్రం బాలీవుడ్ని మొన్నటివరకూ అస్సలు లెక్కలోకి తీసుకోలేదు. 
 
గతంలో అక్కడ్నుంచి అవకాశాలొచ్చినా తృణప్రాయంగా తోసిపుచ్చారు నయన. అయితే... ఈ మధ్య మాత్రం ఓ బాలీవుడ్ చిత్రానికి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. షాహిద్కపూర్ హీరోగా రూపొందే ఈ చిత్రాన్ని టిప్స్ నిర్మాణ సంస్థ నిర్మిస్తోంది. ఈ  సినిమా కోసం నయన కొన్ని డేట్స్ కూడా కేటాయించారు. కానీ... అనుకున్న సమయానికి సినిమా షూటింగ్ మొదలుకాలేదు. దాంతో ‘మీ సినిమా చేయలేను’ అని నయన సదరు నిర్మాతకు తేల్చి చెప్పేశారట. అయితే.... బాలీవుడ్ మీడియా మాత్రం ఈ విషయాన్ని వేరే రకంగా ప్రచారం చేస్తోంది. 
 
పభుదేవాతో షాహిద్కపూర్కి, టిప్స్వారికి ఉన్న అనుబంధం వల్ల... స్వయంగా సదరు సంస్థవారే తమ సినిమా నుంచి నయనను తప్పించారని మీడియాలో కథనాలు వెలువడ్డాయి. దాంతో మనస్తాపానికి లోనై పై విధంగా స్పందించారు నయన. ‘‘పనీపాటా లేనివాళ్లు చేసే నిర్వాకం ఇది. డేట్స్ నేనే వెనక్కు తీసుకున్నానో లేక వాళ్లే తప్పించారో నిర్మాతల్నే అడగండి. కెరీర్ మొదలైనప్పట్నుంచీ అలాంటి అనుభవం నాకెప్పుడూ ఎదురవ్వలేదు. అవ్వదు కూడా’’ అని తేల్చి చెప్పారామె.