ఆర్యతో, నయన మూడోసారి..

7 Apr, 2016 02:17 IST|Sakshi
ఆర్యతో, నయన మూడోసారి..

ఒక్కోసారి హీరోహీరోయిన్ల వలన కూడా ఆ చిత్రానికి క్రేజ్ వచ్చేస్తుంది. కోలీవుడ్‌లో అలాంటి జంటే ఆర్య, నయనతారలు. రీల్‌లైఫ్‌లోనే కాదు రియల్ లైఫ్‌లోనూ ఈ ఇద్దరిపై పలు సెటైర్లు వినిపిస్తుంటాయి. ఆర్య, నయనతారల మధ్య సంథింగ్ సంథింగ్ ఉన్నట్లు కూడా వదంతులు జోరుగా సాగుతుంటాయి. ఇక నటన పరంగా చూస్తే వీరిది హిట్ పెయిరే. ఇంతకు ముందు ఆర్య, నయనతార కలసి నటించిన బాస్ ఎన్గిర భాస్కరన్, రాజారాణి చిత్రాలు మంచి విజయం సాధించాయి.
 
  తాజాగా ముచ్చటగా మూడోసారి తెరపై రొమాన్స్ చేయడానికి ఈ క్రేజీ జంట సిద్ధమవుతున్నాని సమాచారం. వరుస విజయాలతో మంచి జోష్‌లో ఉన్న నయనతారకు ఇప్పుడు అవకాశాల మీద అవకాశాలు వచ్చి పడుతున్నాయి. ప్రస్తుతం కార్తీతో కాష్మోరా చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్న ఆ భామ కోసం చాలా చిత్రాలు ఎదురు చూస్తున్నాయి. స్నేహితురాలు త్రిషతో కలసి తన ప్రేమికుడిగా ప్రచారంలో ఉన్న విఘ్నేశ్‌శివ దర్శకత్వంలో ఏఎం.రత్నం నిర్మించనున్న భారీ చిత్రంలో నటించనున్నారన్న టాక్ వినిపిస్తోంది.
 
  అదే విధంగా మోహన్‌రాజా దర్శకత్వంలో శివకార్తికేయన్ సరసన నటించడానికి పచ్చజెండా ఊపినట్లు సమాచారం. తాజాగా సుందర్.సీ దర్శకత్వంలో ఆర్యతో రొమాన్స్‌కు రెడీ అన్నట్లు కోలీవుడ్ వర్గాల టాక్. అరణ్మణై-2 చిత్రం తరువాత సుందర్.సీ తదుపరి చిత్రానికి సిద్ధమవుతున్నారు.ఈయన ఇంతకు ముందు విమల్, మిర్చిశివ, అంజలి, ఓవియలతో రూపొందించిన కలగలప్పు చిత్రం మంచి ప్రేక్షకాదరణ పొందింది. ఇప్పుడు దానికి సీక్వెల్‌ను తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో ఆర్య,నయనతార హీరో హీరోయిన్లుగా నటించనున్నట్లు సమాచారం.