నయన్‌.. అందులోనూ అగ్రస్థానమే..!

10 Mar, 2018 10:17 IST|Sakshi

తమిళసినిమా: ఎదురు దెబ్బలను తట్టుకుని నిలబడితే ఆ తరువాత అంతా ఆనందమే. ఇందుకు నటి నయనతార ఒక ఉదాహరణ అని చెప్పవచ్చు. స్టార్ హీరోయిన్‌ నయనతార ఆదిలో ఎన్నో అవమానాలను, అవరోధాలను ఎదుర్కొన్నారు. వ్యక్తిగతంగా చాలా ఒడిదుడుకులు చవిచూశారు. ప్రేమలోనూ రెండు సార్లు విఫలమయ్యారు. వాటన్నింటినీ ఎదురొడ్డి ఇప్పుడు అగ్రనటి స్థానాన్ని దక్కించుకున్నారు.

ఒకప్పుడు గ్లామర్‌ పాత్రల్లో దుమ్మురేపిన నయనతార ఇప్పుడు అభినయంతోనూ అదరగొడుతున్నారు. ఇంత బిజీగా ఉన్నా దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌తో ప్రేమ, షికార్లు చేస్తున్నారు. ఇటీవల పర్సనల్‌ లైఫ్‌ కోసం కాస్త సమయాన్ని కేటాయించి విఘ్నేశ్‌శివన్‌తో విదేశాలకు చెక్కేశారు. సింగపూర్, దుబాయ్‌లో విహరించి ఆ తరువాత అమెరికా చేరుకున్నారు. అటు నుంచి సొంత గడ్డ (కేరళలోని కొచ్చి)కి చేరుకుంటారట. అక్కడ మలయాళ సూపర్‌స్టార్‌తో కలిసి నటించే భారీ చిత్రంలో పాల్గొంటారని సమాచారం. 

తాజా సమాచారం ఏమిటంటే నయనతార ఇంతకుముందు పారితోషికంగా రూ.3కోట్లు పుచ్చుకునే వారు. అయితే తను సెంట్రల్‌ రోల్‌ పోషించిన అరమ్‌ చిత్రం విజయం మరింత ఇమేజ్‌ను తెచ్చి పెట్టింది. అంతే అమ్మడు పారితోషికాన్ని రూ.4కోట్లకు పెంచేశారనే ప్రచారం జోరందుకుంది. ప్రస్తుతం స్టార్‌ హీరోల చిత్రాలు తనవైపు రావడంతో పారితోషికం విషయంలో మరింత డిమాండ్‌ చేస్తున్నారనే టాక్‌ సోషల్‌ మీడియాల్లో వైరల్‌ అవుతోంది. నయనతార తెలుగులో చిరంజీవికి జంటగా సైరా నరసింహారెడ్డి చిత్రంలో నటిస్తున్నారు.

త్వరలో అజిత్‌ సరసన విశ్వాసం చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్నారు. ఇక సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ తాజా చిత్రంలోనూ నయనే నాయకి అనే ప్రచారం జోరందుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో మమ్ముట్టితో కలిసి నటించనున్న తాజా చిత్రం కోసం తన పారితోషికాన్ని అక్షరాల రూ.5కోట్లు డిమాండ్‌ చేసినట్లు టాక్‌ స్ప్రెడ్‌ అయ్యింది. ఇది తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో తెరకెక్కనుందని సమాచారం. దక్షిణాదిలో ఇంత మొత్తంలో పారితోషికం తీసుకుంటున్న ఏకైక నటి నయనతారనే అవుతుంది. ఇలా అగ్రనాయకిగా వెలుగొందుతున్న నయనతార పారితోషికంలోనూ అగ్రస్థానాన్నే అధిరోహించిందన్న మాట.

మరిన్ని వార్తలు