మళ్లీ భయపెడతా!

9 Feb, 2016 03:25 IST|Sakshi
మళ్లీ భయపెడతా!

మరోసారి సిల్వర్‌స్క్రీన్‌పై ప్రేక్షకులను భయపెట్టడానికి రెడీ అవుతున్నారు సంచలన క్రేజీ తార నయనతార.ఇంతకు ముందు హర్రర్ థ్రిల్లర్ కథాంశంతో కూడిన మాయ చిత్రంలో నటించి నిర్మాతలకు కాసుల వర్షం కురిపించిన నయనతార తాజాగా ఆ తరహా చిత్రంతో భయపెట్టడానికి సిద్ధం అవుతున్నారు.ఇంతకు ముందు నాన్ అవన్‌ఇల్లై,అంజాదే, పాండి, మిగామన్ వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన నెమిజంద్ జపక్ సంస్థ అధినేత వీ.హిందేష్ జపక్ నిర్మిస్తున్న తాజా చిత్రం ఇది.

దీన్ని దర్శకుడు సర్గుణం తన సర్గుణం సినిమాస్ పతాకంపై తొలి కాపీ కాంట్రాక్ట్ విధానంలో నిర్మించనున్నారు. ఆయన శిష్యుడు రామసామి ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం కానున్నారు. ఇది హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రం అని, హర్రర్,కామెడీతో కూడిన క్రైమ్ థ్రిల్లర్ ఇతి వృత్తంతో కూడిన ఈ చిత్రం పిల్లల నుంచి పెద్దల వరకూ చూసి ఆనందించే జనరంజక చిత్రంగా ఉంటుందని, చిత్ర షూటింగ్ ఈ నెలలోనే ప్రారంభం కానుందని చిత్ర వర్గాలు వెల్లడించారు. తంబిరామయ్య, హరీష్ ఉత్తమ్ ముఖ్యపాత్రలు పోషించనున్న ఈ చిత్రానికి వివేక్ మెర్విన్ సంగీత బాణీలు కడుతున్నట్లు తెలిపారు.