రూల్స్ పక్కన పెట్టేసిన సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్
సాక్షి, చెన్నై : ప్రముఖ హీరోయిన్ నయనతార సాధారణంగా సినిమా ప్రమోషన్లు, పబ్లిక్ ఫంక్షన్లకు దూరంగా ఉండే విషయం తెలిసిందే. అయితే తొలిసారి ఆమె ఓ కార్యక్రమంలో పాల్గొన్న వార్త ప్రస్తుతం వైరల్ అవుతోంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి నయన్ ప్రత్యేక అతిథిగా హాజరు అయ్యారు. ఆదాయ పన్ను శాఖ, ఓ ప్రయివేట్ సోషల్ సర్వీస్ సంస్థ సంయుక్తంగా నిర్వహించిన అయిదు కిలోమీటర్ల వాక్ ఏ థాన్లో ఆమె పాల్గొన్నారు. చెన్నైలోని నుంగమ్బాకమ్లో జరిగిన ఈ ఈవెంట్కు నయనతార రావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. 5కె వాక్ థాన్లో పాల్గొన్న ఆమె ఫోటోలు తాజాగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. రమేష్ బాల ఈ ఫోటోలను ట్విటర్లో షేర్ చేశారు.
కాగా దశాబ్ధ కాలంగా నయనతార పబ్లిక్ ఈవెంట్తో పాటు చిత్ర పరిశ్రమలోని ఏ అవార్డు ఫంక్షన్కు హాజరు కాలేదు. ప్రస్తుతం నయనతార నెట్రికన్ అనే చిత్రంతో పాటు, ఆర్జే.బాలాజీ స్వీయ దర్శకత్వంలో ‘మూక్కుత్తి అమ్మన్’ అనే భక్తిరస కథా చిత్రంలో నటిస్తున్నారు. కాగా కోట్లలో పారితోషికం తీసుకునే నయన్.. సినిమా ఫంక్షన్లకు, ప్రమోషన్లకు అసలు హాజరు కాదు. కానీ మొదటి సారి ఆమె తన నియమాలను పక్కన పెట్టేశారు. ఇటీవలే ఓ టీవీ అవార్డు ఫంక్షన్లోనూ పాల్గొన్నారు. అయితే కోట్ల పారితోషకం డిమాండ్ చేసే నయనతార ఆ సినిమాల ప్రమోషన్కు మాత్రం రారని, అయితే అవార్డుల అందుకోవడానికి మాత్రం రెడీ అవుతున్నారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆమె అంతర్జాతీయ మహిళా దినోత్సవ ఫంక్షన్లో పాల్గొని అందరికి షాక్ ఇచ్చారు.