వివాహం వాయిదా పడిందా..?

13 Nov, 2019 07:28 IST|Sakshi

సినిమా: దక్షిణాదిలో అగ్రకథానాయకిగా రాణిస్తున్న నటి నయనతార. ఇప్పటికే రెండుసార్లు ప్రేమపేరుతో మోసగించిపోయిందన్న విషయం తెలిసిందే. అయినా మూడోసారి ప్రేమనే నమ్ముకుంది. శింబుతో ప్రేమ పెళ్లి వరకూ చేరలేదు. ప్రభుదేవాతో పెళ్లి వరకూ వచ్చి ఆగిపోయింది. ఇప్పుడు దర్శకుడు విఘ్నేశ్‌శివన్‌తో ప్రేమలో మునిగితేలుతోంది. వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారు కూడా. అయినా సమాజంలో జీవిస్తున్నారు కనుక పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. మరోవైపు దర్శకుడు విఘ్నేశ్‌శివన్‌ ఇంట్లో పెళ్లి ఒత్తిడి పెరగడంతో పెళ్లి చేసుకోవాన్న నిర్ణయానికి ఇదీ ఒక కారణం అని ప్రచారం జరుగుతోంది. కాగా ఓ ప్రముఖ జ్యోతిష్కుడు కూడా నయనతార వివాహం డిసెంబరులో జరుగుతుందని చెప్పారు.

ఈ జంట కూడా పెళ్లికి రెడీ అయినట్లు ఇటీవల జోరుగా ప్రచారం సాగింది. అయితే తాజాగా పెళ్లి వాయిదా వేసుకున్నట్లు టాక్‌ స్ప్రెడ్‌ అయ్యింది. లేడీ సూపర్‌స్టార్‌గా దక్షిణాదిలో  బిజీగా ఉన్న నయన్‌ ఇటీవల విజయ్‌తో బిగిల్‌ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రజనీకాంత్‌ సరసన నటించిన దర్బార్‌ చిత్రం 2020 జనవరిలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. ప్రస్తుతం తన ప్రియుడు విఘ్నేశ్‌శివన్‌ నిర్మిస్తున్న వెట్రికన్‌ అనే లేడీ ఓరియెంటెడ్‌ కథా చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం తరువాత  పెళ్లి చేసుకోవాలనుకున్నట్లు ప్రచారం సాగింది. అలాంటిది తాజాగా నయనతార మరో చిత్రానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేసింది. ఎల్‌కేజీ చిత్రంతో పాపులర్‌ అయిన ఆర్‌జే.బాలాజీ దర్శకుడిగా అవతారమెత్తి ప్రధాన పాత్రలో నటించడానికి రెడీ అయ్యారు. ఐసరి గణేశ్‌ తన వేల్స్‌ ఇంటర్నేషనల్‌ పతాకంపై నిర్మించనున్న ఈ చిత్రానికి ముక్కుత్తి అమ్మన్‌ అనే టైటిల్‌ను కూడా నిర్ణయించారు. కథానాయకి పాత్రలో నయనతార నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఇందులో ఆమె పోలీస్‌అధికారిగా నటించబోతున్నట్లు సమాచారం. దీంతో నయనతార పెళ్లిని వాయిదా వేసుకున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.

మరిన్ని వార్తలు