తను ఓవర్ యాక్షన్ చేసింది-నీ జోక్యం అనవసరం

28 Oct, 2013 00:00 IST|Sakshi
ఏ వివాదాలు లేకపోయే సరికి... ఎవరో ఒకరి విషయంలో తల దూర్చి మరీ వివాదాలను కొని తెచ్చుకుంటున్నారు నయనతార. వేరొకరితో అసభ్యకర సన్నివేశాలు తీసి, అందులో తాను ఉన్నట్లుగా చిత్రీకరించారంటూ ‘నయ్యాండి’ సినిమా విషయంలో ఆ చిత్ర కథానాయిక నజ్రియా నజీమ్ రాద్ధాంతం చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంలో తనకెలాంటి సంబంధం లేకపోయినా నయనతార స్పందించడం కోలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. ‘‘నజ్రియా నిజంగా ఓవర్ యాక్షన్ చేసింది. 
 
సినిమా అంటేనే గ్లామర్. అది తెలిసే కదా ఇక్కడకొచ్చేది. అలాంటప్పుడు వివాదాలు చేయడమెందుకు’’ అని ఆమె ఓ సందర్భంలో అనడం నజ్రియాకు కూడా చిర్రెత్తుకొచ్చేలా చేసింది. ‘‘ఇష్టం లేని విషయంపై నిరసన వ్యక్తం చేసే హక్కు నాకుంది. ఈ విషయంలో నయనతార జోక్యం అనవసరం. అయినా ఆమెకు సంబంధం లేని వ్యవహారంలో జోక్యం చేసుకోవడం ఏంటి?’’ అని ఘాటుగా కౌంటర్ ఇచ్చారు నజ్రియా. కెరీర్ మంచి పీక్‌లో ఉన్నప్పుడు కొన్ని కొన్ని విషయాలను భూతద్దంలో చూడకూడదని, ఆమె మంచి కోరుకునే సాటి నటిగా మాత్రమే తాను స్పందించానని ఆ తర్వాత నయన వివరణ ఇవ్వడం విశేషం.