స్టార్‌ ఫార్ములాతో సక్సెస్‌: నయనతార

18 Jan, 2020 09:58 IST|Sakshi

చెన్నై : సినిమాలో అవకాశాలు, విజయాలు వంటివేవైనా అల్టిమేట్‌గా సొమ్ము చేసుకోవడమే. ఆ తరువాత పేరు, హోదా ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయి. ఆపై వాటిని నిలుపుకుంటే చాలు. లైష్‌ హ్యాపీ. నటి నయనతార ఇప్పుడు ఇదే పాలసీని ఫాలో అవుతోందనిపిస్తోంది. ఆరంభం నుంచే ఈ బ్యూటీ లక్కీ అనే చెప్పాలి. అయ్యా చిత్రంతో కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చి ఆ తరువాత స్టార్‌ హీరోలు విజయ్, అజిత్, సూర్య, శింబు, విశాల్‌ వంటి వారితో జత కట్టింది. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌తో చంద్రముఖి చిత్రంతోనే బాగా పాపులర్‌ అయ్యింది. అలా స్టార్‌ హీరోలతో జత కట్టి క్రేజ్‌ను సంపాధించుకున్న నయనతార ఆ తరువాత విజయ్‌సేతుపతి, శివకార్తీకేయన్, ఆరి వంటి అప్‌ కమింగ్‌ హీరోలతో నటించింది. అలాంటి చిత్రాల విజయాలను తనకే ఎక్కువగా ఆపాధించుకోవడంతో హీరోయిన్‌ ఓరియన్‌టెడ్‌ కథా చిత్రాల్లో నటించే స్థాయికి చేరుకుంది.

సినిమా, వ్యక్తిగత చర్చనీయాంశమైన ప్రేమ, సహజీవనం, వివాదాలు, విడిపోవడాలు వంటి సంఘటనలతో ఎప్పుడూ వార్తల్లో ఉంటూ తన పాపులారిటీని మరింత పెంచుకుంటున్న నయనతార ఇప్పుడు సుమారు రూ.5 కోట్లు పారితోషికం డిమాండ్‌ చేసే స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం కుర్ర హీరోలను పక్కన పెట్టేసి స్టార్‌ హీరోలతోనే నటించడం మొదలెట్టింది. ఇందుకో లాజిక్‌ ఉంది. కుర్రహీరోలతో నటించే చిత్రాల్లో నటించడానికి అవకాశం ఉంటుంది. అందుకు కాల్‌షీట్స్‌ అధికంగా కేటాయించాల్సి ఉంటుంది. అదే స్టార్‌ హీరోల చిత్రాల్లో పెద్దగా నటించాల్సిన అవసరం ఉండదు. ఉదాహరణకు ఇటీవల నటించిన తెలుగు చిత్రం సైరా నరసింహారెడ్డి, తమిళంలో విజయ్‌తో నటించిన బిగిల్, రజనీకాంత్‌తో జత కట్టిన దర్బార్‌ చిత్రాలనే తీసుకుంటే వీటిలో నయనతార పాత్ర పరిధి చాలాతక్కువ. పారితోషికం మాత్రం రూ.4 కోట్లకు పైనే అనే ప్రచారం జరుగుతోంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏమంటే తను ముందుగా కేటాయించిన కాల్‌షీట్స్‌ కంటే ఎక్కువ ఇవ్వదు. అదేవిధంగా తను నటించిన చిత్రాలు ఇతర భాషల్లోకి అనువాదం అయితే అందుకు మరికొంత పారితోషికం చెల్లించాలన్న నిబంధనలను విధిస్తోందని సమాచారం.

ఇకపోతే షూటింగ్‌కు వచ్చానా, నటించినా అంతటితో తన పని అయిపోయ్యిందని, ఆ చిత్రం ఎలాంటి ప్రమోషన్‌కు రాననీ ముందుగానే ఒప్పందంలో కాస్‌ పెడుతోంది. మరో విషయం ఇటీవల స్టార్‌ హీరోలతోనే నటించాలని నిర్ణయించుకుందట. అందుకు కారణం తక్కువ కాల్‌షీట్స్‌తో ఎక్కువ పారితోషికం లభించడమే. ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం ఉండదు. హీరోతో రెండు పాటలో లెగ్‌ షేక్‌ చేయడం, మరో నాలుగు సన్నివేశాల్లో కనిపించడం (దర్బార్‌ చిత్రంలో అంతేగా) వంటివి చేస్తే చాలు. ఇక ఆ చిత్రాల విజయాలు ఎలాగూ తన ఖాతాలోనూ పడతాయి. ఇప్పుడు బిగిల్, దర్బార్‌ వంటి చిత్రాల విజయాలను తనూ షేర్‌ చేసుకుంటోంది. అందుకే స్టార్‌ హీరోల ఫార్ములా అన్ని విధాలుగా బాగుందని నయనతార భావిస్తోందట. ఇక హీరోయిన్‌ సెంట్రిక్‌ కథా చిత్రాలకు ఎలానూ తన ఆధిక్యం ఉంటుంది కాబట్టి ఆ తరహా చిత్రాలకూ ఓకే చెబుతోందట. ప్రస్తుతం అలాంటి రెండు చిత్రాల్లో నటిస్తోంది. 

మరిన్ని వార్తలు