మారాల్సిందే తప్పదు!

13 Feb, 2020 09:33 IST|Sakshi

సినిమా: క్షణ క్షణంబుల్‌ జవరాలి చిత్తంబుల్‌ అంటారు. మరీ అంత కాకపోయినా మన హీరోయిన్లూ తరచూ నిర్ణయాలను మార్చుకుంటారని చెప్పవచ్చు. ఒకసారి గ్లామరస్‌ కథాపాత్రల్లో నటించాలని ఉందంటారు. మరోసారి పక్కింటి అమ్మాయి లాంటి మంచి పాత్రల్లో నటించాలని కోరుతుంటారు. ఒక్కొక్కరు ఒక్కో అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తే పర్వాలేదు. ఒక్కనటే భిన్నభావాలను వ్యక్తం చేస్తే సందర్భాలను బట్టి నిర్ణయాలను మార్చుకోవడం అనక తప్పదు. ఇప్పుడు నటి నయనతారను ఈ కోవకే చేర్చాల్సి ఉంటుంది. దక్షిణాది సినిమాలో నంబర్‌వన్‌ కథానాయకిగా రాణిస్తున్న నటి నయనతార. లేడీ ఓరియెంటెడ్‌ కథా చిత్రాల నాయకిగా మారి తన చిత్రాలను ఒంటి చేతితో విజయాల తీరాన్ని దాటించింది. అలాంటిది ఇటీవల ఈ అమ్మడు నటించిన డోరా, ఐరా వంటి హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ కథా చిత్రాలు పూర్తిగా నిరాశపరిచాయి. అంతేకాదు స్టార్‌ హీరోలు రజనీకాంత్, విజయ్, అజిత్‌ వంటి హీరోలతో జత కట్టిన చిత్రాలు సక్సెస్‌ అయ్యాయి.

ఏదేమైనా నయనతారకు అవకాశాలు తగ్గుముఖం పట్టాయనే ప్రశ్న తలెత్తుతోంది. ఈ సందేహం నయనతారకే వచ్చిందని సమాచారం. ఎందుకంటే అమె చేతిలో ఎక్కువ చిత్రాలు లేవు. ఆర్‌జే.బాలాజీ దర్శకత్వంలో నటిస్తున్న మూక్తూత్తి అమ్మన్‌ చిత్ర షూటింగ్‌ పూర్తి అయ్యింది. ప్రస్తుతం రజనీకాంత్‌తో మరోసారి ఆయన 168వ చిత్రంలో నటిస్తోంది. ఇందులో ఒక కీలక పాత్రనే చేస్తోందనే ప్రచారం జరుగుతోంది. కాగా తన ప్రియుడు విఘ్నేశ్‌శివన్‌ను నిర్మాతగా చేసిన నెట్రికన్‌ అనే చిత్రం చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. ఆ చిత్రం ఏమైందో తెలియదు. తాజాగా తన ప్రియుడు విఘ్నేశ్‌శివన్‌ దర్శకత్వంలోనే నటుడు విజయ్‌సేతుపతికి జంటగా ఒక చిత్రం చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో నటి సమంత మరో నాయకిగా నటించనున్నట్లు టాక్‌ నడుస్తోంది. ఇక తెలుగు వంటి ఇతర భాషల్లో అవకాశాలు లేవు. కాగా నయనతార గ్లామరస్‌ పాత్రల్లో నటించి చాలా కాలమైంది. ఎప్పుడైతే లేడీ ఓరియెంటెడ్‌ కథా చిత్రాల నాయకిగా మారిందో అప్పటి నుంచి గ్లామర్‌కు దూరంగా ఉంటోంది.

అప్పుడప్పుడూ చుడీదార్లు మినహా ఎక్కువగా ఈ అమ్మడిని చీరలోనే చూస్తున్నాం.  ఈ అవతారం ఆమెకు బోర్‌ కొట్టినట్లుంది. అంతే కాదు అవకాశాలు తగ్గడానికి గ్లామర్‌గా కనిపించకపోవడం కూడా ఒక కారణం అని నయనతార  గ్రహంచిని, దీంతో గ్లామర్‌కు మారాల్సిందేననే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అంతే కాదు తాను అందాలారబోతకు రెడీ అని నిర్మాతలకు సంకేతాలు పంపుతున్నట్లు తాజా సమాచారం. కాగా ప్రారంభ దశలో నయనతార గజని, బిల్లా వంటి చిత్రాల్లో ఈత దుస్తులు, కురసదుస్తులు ధరించి అందాల మోత మోగించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ ఆ తరహా అందాలను తెరపై ఆవిష్కరించి విజృంభించడానికి ఈ సంచలన నటి సిద్ధం అవుతున్నట్లు టాక్‌ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ఇది కొందరు హీరోయిన్లను కలతకు గురిచేస్తుందనే ప్రచారం జరుగుతోంది. నయనతార ఎప్పుడు రిటైర్‌ అవుతుందా ఆ స్థానాన్ని దక్కించుకోవాలని ఆరాటపడుతున్న వారికి నయనతార నిర్ణయం కంటగింపుగా మారిందని కోలీవుడ్‌ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నారు.

మరిన్ని వార్తలు