బంధాలు మళ్లీ గుర్తొస్తాయి

17 Aug, 2019 00:35 IST|Sakshi
శుభాంగి పంత్, అరవింద్‌

‘‘నీకోసం’ సినిమా నాకు బాగా నచ్చింది. సిస్టర్‌ సెంటిమెంట్‌ సీన్స్‌ హైలైట్‌గా ఉంటాయి. ఊహించని మలుపులతో కథ సాగుతుంది. ఈ చిత్రంతో అవినాష్‌ వంటి మరో ప్రతిభావంతుడైన దర్శకుడు టాలీవుడ్‌కి పరిచయం అవుతున్నాడు. ఇలాంటి మంచి సినిమాను అందరూ ఆదరించాలి’’ అని నిర్మాత బెక్కం వేణుగోపాల్‌ అన్నారు. అరవింద్‌ రెడ్డి, అజిత్‌ రాధారామ్‌ హీరోలుగా, çశుభాంగి పంత్, దీక్షితా పార్వతి హీరోయిన్లుగా అవినాష్‌ కోకటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నీకోసం’. రాజలింగం సమర్పణలో అల్లూరమ్మ (భారతి) నిర్మించిన ఈ సినిమా ట్రైలర్‌ని హైదరాబాద్‌లో విడుదల చేశారు.

అవినాష్‌ కోకటి మాట్లాడుతూ– ‘‘ఎమోషనల్‌ లవ్‌ స్టోరీగా తెరకెక్కిన చిత్రమిది. ప్రివ్యూ చూసిన పెద్దలందరూ సినిమా చాలా బావుందని మెచ్చుకున్నారు. సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ కచ్చితంగా నచ్చుతుంది. మర్చిపోయిన లేదా వదిలేసిన బంధాలన్నీ మళ్లీ గుర్తొస్తాయి’’ అన్నారు. ‘‘అందరం కొత్తవాళ్లమే అయినా చాలా కొత్తదనం ఉన్న కథతో వస్తున్నాం’’ అన్నారు అరవింద్‌ రెడ్డి. ‘‘మా సినిమాలో ప్రతి పాత్రకూ ప్రాధాన్యం  ఉంటుంది’’ అన్నారు అజిత్‌ రాధారామ్‌. ‘‘ఈ సినిమాకి రీ రికార్డింగ్‌ చేస్తున్నప్పుడే మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం కుదిరింది’’ అన్నారు సంగీత దర్శకుడు శ్రీనివాస్‌ శర్మ. శుభాంగి పంత్, దీక్షితా పార్వతి మాట్లాడారు. ఈ చిత్రానికి కెమెరా: శివక్రిష్ణ యెడుల పురమ్‌.

మరిన్ని వార్తలు