నీతోనే...

16 Aug, 2019 00:11 IST|Sakshi
చరిష్మా శ్రీకర్‌, అరుణ్‌ తేజ్

‘‘శ్రీ వెంకటేశ్వర భక్తి చానల్‌ చైర్మన్‌ అయిన తర్వాత నేను హాజరైన మొదటి ఆడియో ఫంక్షన్‌ ‘నీతోనే హాయ్‌ హాయ్‌’. ఇందులోని ఐదు పాటలు బావున్నాయి’’ అన్నారు నటుడు పృథ్వీ. అరుణ్‌ తేజ్, చరిష్మా శ్రీకర్‌ జంటగా  బియన్‌ రెడ్డి అభినయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నీతోనే హాయ్‌ హాయ్‌’. డా. యలమంచిలి ప్రవీణ్‌ సమర్పణలో డా. యలమంచిలి ప్రవీణ్, డా. ఏయస్‌ కీర్తి, డా. జి.పార్థసారధి రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 23న విడుదలవుతోంది. ఈ చిత్రం పాటలను పృథ్వీ ఆవిష్కరించి, మాట్లాడుతూ– ‘‘ట్రైలర్‌ చూస్తుంటే దర్శకుడి ప్రతిభ ఏంటో తెలుస్తోంది.

ముగ్గురు నిర్మాతలు మంచి అభిరుచితో ఈ చిత్రాన్ని నిర్మించారు.  హీరో, హీరోయిన్‌ మంచి నటన కనబరిచారు. ‘నీతోనే హాయ్‌ హాయ్‌’ మంచి విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘నన్ను, నా కథని నమ్మి, నిర్మాతలు రాజీ పడకుండా ఈ సినిమా నిర్మించారు. ఇటీవల సెన్సార్‌ పూర్తయింది’’ అన్నారు బియన్‌ రెడ్డి అభినయ. ‘‘వైవిధ్యమైన కథాంశంతో వస్తోన్న మా సినిమాని ప్రేక్షకులు విజయవంతం చేయాలని కోరుకుంటున్నా’’ అన్నారు డా. ఏయస్‌ కీర్తి,  డా. పార్థసారధి రెడ్డి. ‘‘ఎంతో ప్యాషన్‌తో ఈ సినిమా నిర్మించాం’’ అన్నారు  డా. యలమంచిలి ప్రవీణ్‌. ‘‘ఈ సినిమాతో హీరోగా మంచి బ్రేక్‌ వస్తుందన్న నమ్మకం ఉంది’’ అన్నారు అరుణ్‌ తేజ్‌.

మరిన్ని వార్తలు