‘డిప్రెషన్‌లో ఉన్నా... దయచేసి నన్ను బతకన్విండి’

5 Jan, 2019 10:36 IST|Sakshi
హిమాంశుతో నేహా కక్కర్‌

‘అవును.. నేను డిప్రెషన్‌లో ఉన్నాను. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతికూల భావాలు గల ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదాలు. నా జీవితంలో అత్యంత బాధాకరమైన, ఘోరమైన రోజులు కల్పించి మీరు విజయం సాధించారు. అందుకు మీకు శుభాభినందనలు’ అంటూ గాయని నేహా కక్కర్‌ తన మనసులోని భావాలను సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నారు. సింగింగ్‌ ప్రోగ్రామ్‌ ‘ఇండియన్‌ ఐడల్‌’ ద్వారా వెలుగులోకి వచ్చిన నేహా కక్కర్‌.. తర్వాతి సీజన్‌లో అదే కార్యక్రమానికి న్యాయనిర్ణేతగా వ్యవహరించి అరుదైన అనుభవాన్ని సొంతం చేసుకున్నారు. కాలా చష్మా, దిల్‌బర్‌ రీమిక్స్‌ వంటి పలు బాలీవుడ్‌ హిట్‌ సాంగ్స్‌ ఆలపించిన నేహా ప్రస్తుతం డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాననడం ఆమె అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది.

అయితే నేహా బాధ పడటానికి కారణం నటుడు హిమాంశ్‌ కోహ్లి అంటూ అతడిపై విమర్శలు రావడంతో... ‘ ఒకటి స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. ఏ ఒక్కరి కారణంగానో నేను ఈ స్థితికి రాలేదు. నా ‍వ్యక్తిగత జీవితాన్ని ప్రశాంతంగా గడపడం ఈ ప్రపంచానికి ఇష్టం లేనట్టుంది. నాలో ఉన్న ప్రతిభను ప్రేమించే,  ప్రోత్సహించే ప్రతీ ఒక్కరికి రుణపడి ఉంటాను. కానీ కొంతమంది మాత్రం నా గురించి వారికి ఏమీ తెలియకపోయినా బురద చల్లాలని చూస్తున్నారు. మిమ్మల్ని అడుక్కుంటున్నా. దయచేసి నన్ను సంతోషంగా బతకనివ్వండి. ఒకరి జీవితాన్ని నిర్ణయించే అధికారం తీసుకోకండి. ప్లీజ్‌ నన్ను బతకనివ్వండి అంటూ ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో నేహా రాసుకొచ్చారు.

కాగా నేహా కక్కర్‌, హిమాంశు ఇండియన్‌ ఐడల్‌ 10  వేదిక మీద తమ మధ్య ఉన్న అనుబంధం గురించి రివీల్‌ చేశారు. అయితే గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తాయనే రూమర్లు వస్తున్నాయి. ఈ క్రమంలో.. ఇటీవలే ఇన్‌స్టాగ్రామ్‌లో హిమాంశును అన్‌ఫాలో చేసిన నేహా... ప్రస్తుతం ఈ ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీతో ఆ రూమర్లకు మరింత బలాన్ని చేకూర్చారు.

మరిన్ని వార్తలు