1980 ప్రేమకథ

10 Jan, 2020 03:02 IST|Sakshi

రతన్‌ కిషోర్, సన్యాసిన్హా, సాగారెడ్డి, సత్య, ధన, గౌతమ్‌ రాజ్‌ ముఖ్య తారలుగా సాగారెడ్డి తుమ్మ దర్శకత్వంలో ఆగాపే అకాడమీ పతాకంపై రూపొందిన చిత్రం ‘నేను కేర్‌ ఆఫ్‌ నువ్వు’. అతుల, శేషిరెడ్డి, పోలీస్‌ వెంకటరెడ్డి, శరద్‌ మిశ్రా సహ నిర్మాతలు. ఈ చిత్రం సెన్సార్‌ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో నిర్మాత బెక్కం వేణుగోపాల్‌ మాట్లాడుతూ– ‘‘నేను కేర్‌ ఆఫ్‌ నువ్వు’ ట్రైలర్‌ బాగుంది. సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుందనిపిస్తోంది. ఈ సినిమా సక్సెస్‌ అయ్యి నిర్మాతలకు మంచి పేరు, డబ్బు తీసుకురావాలి’’ అన్నారు.

‘‘వాస్తవ సంఘటన ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. 1980లో జరిగిన కథ ఇది. ఓ పేదింటి అబ్బాయి.. ఉన్నతమైన అమ్మాయి మధ్య జరిగిన కథను ఈ సినిమాలో అందంగా చూపించారు దర్శకుడు. ఫిబ్రవరి 14న సినిమా విడుదల చేస్తాం’’ అన్నారు  వెంకట్‌ రెడ్డి. ‘‘ఈ సినిమాకి దర్శకత్వం వహించడంతో పాటూ విలన్‌ పాత్రలో నటించాను. చిన్న సినిమాలు సక్సెస్‌ కావాలంటే అందరి సహకారం కావాలి. మనిషిని ప్రేమ జయిస్తుందని ఈ సినిమాలో చెప్పాం’’ అన్నారు సాగారెడ్డి తుమ్మ. పాటల రచయిత ప్రణవం మాట్లాడారు. ఈ చిత్రానికి కెమెరా: జి.కృష్ణ ప్రసాద్, సంగీతం: ఎన్‌.ఆర్‌.రఘునందన్‌.

మరిన్ని వార్తలు