ఆర్‌కే, వడివేలు కాంబినేషన్ లో మరో చిత్రం

6 Jan, 2017 01:18 IST|Sakshi
ఆర్‌కే, వడివేలు కాంబినేషన్ లో మరో చిత్రం

నటుడు ఆర్‌కే, వడివేలు కలిసి నటించిన ఎల్లాం అవన్  సెయల్, అళగర్‌ మలై చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. తాజాగా మరోసారి ఈ హిట్‌ కాంబినేషన్ లో చిత్రం తెరకెక్కనుంది.నటుడు ఆర్‌కే ప్రస్తుతం కథానాయకుడిగా నటిస్తూ తన పాసరై బ్యానర్‌లో నిర్మిస్తున్న చిత్రం వైగై ఎక్స్‌ప్రెస్‌. నీతుచంద్ర, ఇనియ, కోమలశర్మ, సుజావరూణి కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో ఆర్‌కే.సెల్వమణి, ఎంఎస్‌.భాస్కర్, రమేశ్‌ఖన్నా ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి షాజీకైలాష్‌ దర్శకత్వం వహిస్తున్నారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని వచ్చే నెల 200 లకు పైగా థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఆర్‌కే తెలిపారు.

వైగై ఎక్స్‌ప్రెస్‌ చిత్రం విడుదలకు ముందే మరో చిత్రాన్ని నిర్మించి, హీరోగా నటించడానికి ఆర్‌కే సిద్ధమయ్యారు. దీనికి నీయుమ్‌ నానుమ్‌ నడువుల పేయుమ్‌ అనే టైటిల్‌ను నిర్ణయించినట్లు తెలిపారు. ఇందులో హాస్య పాత్రను నటుడు వడివేలు పోషించనున్నారని చెప్పారు.ఇంతకు ముందు తన్నీయిల్‌ గండం వంటి సక్సెస్‌ఫుల్‌ చిత్రాన్ని తెరకెక్కించిన ఎస్‌ఎన్ .శక్తివేల్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు తెలిపారు. వినోదమే ప్రధానంగా తెరకెక్కనున్న ఈ చిత్రం త్వరలో ప్రారంభం కానుందని చెప్పారు. ఈ చిత్రానికి రాజారత్నం ఛాయాగ్రహణం అందించనున్నారని ఆర్‌కే తెలిపారు.