సంసారం.. సేమియా ఉప్మా

2 Nov, 2017 00:45 IST|Sakshi

‘‘యామిరిక్క భయమేన్‌’ తమిళ సినిమాని తెలుగులో రీమేక్‌ చేయాలని రెండేళ్ల క్రితం నా మనసులో అనుకున్నా. రీమేక్‌ హక్కులు ‘బన్నీ’ వాసుగారి వద్ద ఉన్నాయని తెలిసి, నేను కామ్‌ అయిపోయా. అయితే, ఆ సినిమా చివరకు నా దగ్గరకే వచ్చింది’’ అని హీరో ఆది అన్నారు. ఆది, వైభవీ శాండిల్య, రష్మీ గౌతమ్, బ్రహ్మాజీ ముఖ్య తారలుగా యాంకర్, నటుడు ప్రభాకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నెక్ట్స్‌ నువ్వే’. వి4 క్రియేషన్స్‌ పతాకంపై ‘బన్నీ’ వాసు నిర్మించిన ఈ సినిమా రేపు (శుక్రవారం) విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఆది పాత్రికేయులతో పలు విశేషాలు పంచుకున్నారు.

► గతేడాది ప్రభాకర్‌గారిని కలిస్తే ఇరవై నిమిషాలు ‘నెక్ట్స్‌ నువ్వే’ కథ చెప్పారు. ‘యామిరిక్క భయమేన్‌’ రీమేక్‌ అయినా తెలుగు నేటివిటీకి తగ్గట్లు మార్పులు చేయడంతో బాగా నచ్చింది. ప్రభాకర్‌గారు ఏంటో నాకు తెలుసు. బాగా డైరెక్ట్‌ చేస్తారని సినిమా చేయడానికి అంగీకరించా.

► గీతా ఆర్ట్స్‌ బేనర్‌ ఈ సినిమా నిర్మిస్తుందని ప్రభాకర్‌గారు చెప్పగానే ఎగ్జయిటింగ్‌గా అనిపించింది. అంతా ఓకే అని ‘బన్నీ’ వాసుగారితో మాట్లాడిన తర్వాత జ్ఞానవేల్‌రాజాగారు, యూవీ క్రియేషన్స్‌ బ్యానర్స్‌ కూడా నిర్మాణంలో భాగమయ్యారు. క్యారెక్టరైజేషన్స్, కథ, మంచి నిర్మాతలు ఉండటంతో మరో ఆలోచనకు అవకాశం కూడా ఇవ్వలేదు. సింగిల్‌ షెడ్యూల్‌లో.. 36 రోజుల్లో షూటింగ్‌ పూర్తయింది.

► సినిమాలో నా పాత్ర పేరు కిరణ్‌. సీరియల్స్‌ తీస్తుంటాను. రాజమౌళి అంత పేరు తెచ్చుకోవాలనే కోరిక. ‘సంసారం.. సేమియా ఉప్మా’ అనే సీరియల్‌ తీస్తుంటాడు. నిర్మాతగా ఓ సీరియల్‌ తీసి, అప్పుల పాలవుతాడు. ఆ అప్పుల నుంచి తప్పించుకోవడానికి రిసార్ట్‌ స్టార్ట్‌ చేయాలనుకుంటాడు. అక్కడ నుంచి అసలు కథ మొదలవుతుంది. సినిమా స్టార్టింగ్‌ నుంచి ఎండింగ్‌ వరకూ హాస్యంతో సాగే ఔట్‌ అండ్‌ ఔట్‌ ఎంటర్‌టైనర్‌ ఇది.

► ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’లో బ్రహ్మాజీగారి పాత్ర చూసి, నేనూ ఈయనతో ఓ సినిమా చేస్తే బావుంటుందనుకున్నా. ‘నెక్ట్స్‌ నువ్వే’తో లక్కీగా ఆయనతో పనిచేసే అవకాశం కలిగింది.

► జ్ఞానవేల్‌ రాజాగారి స్టూడియో గ్రీన్‌ బ్యానర్‌లో తెలుగు, తమిళ భాషల్లో రూపొందనున్న మూడు సినిమాలు చేయబోతున్నా. అలాగే, జ్ఞానవేల్‌ రాజాగారు తెలుగులో చేసే స్ట్రయిట్‌ మూవీలో కూడా నటిస్తున్నా.

మరిన్ని వార్తలు