మా అందరికీ ఇది స్పెషల్‌ మూవీ

30 May, 2019 00:08 IST|Sakshi
శ్రీరాఘవ, సూర్య, కేకే రాధామోహన్, సాయి పల్లవి, రకుల్‌ ప్రీత్‌సింగ్‌

– సూర్య

‘‘అందరికీ సూర్య గొప్ప నటుడు అని తెలుసు. అయితే ఆయన అంతకంటే గొప్ప మనసున్న మనిషి. సూర్య ఎంత సేవ చేస్తున్నారో నాకు తెలుసు. ఆయనకు సెల్యూట్‌’’ అన్నారు శ్రీరాఘవ. సూర్య, సాయిపల్లవి, రకుల్‌ప్రీత్‌ సింగ్‌ హీరో హీరోయిన్లుగా శ్రీరాఘవ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎన్‌జీకే’ (నంద గోపాలకృష్ణ). తెలుగు, తమిళ భాషల్లో రేపు(శుక్రవారం) ఈ చిత్రం విడుదల కానుంది. తెలుగులో కేకే రాధామోహన్‌ విడుదల చేస్తున్నారు.

హైదరాబాద్‌లో జరిగిన ఈ చిత్రం ప్రీ–రిలీజ్‌ ఈవెంట్‌లో సూర్య మాట్లాడుతూ– ‘‘ఒక వ్యక్తి సమాజానికి ఎంత ఉపయోగపడ్డాడు అన్నదే సినిమా కథ. మా అందరికీ స్పెషల్‌ మూవీ. నా గత చిత్రం (‘గ్యాంగ్‌’) విడుదలై ఏడాదిన్నర అయింది. తెలుగు ప్రేక్షకుల ఆదరణతో తెలుగు ఇండస్ట్రీని నా సొంత ఇంటిలా భావిస్తాను. ‘ఎన్‌జీకే’ ప్రేక్షకులకు యూనిక్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇస్తుంది’’ అన్నారు. ‘‘ఇంతకుముందు హిట్‌ సాధించిన సూర్య సినిమాలకు ‘ఎన్‌జీకే’ చిత్రం దీటుగా ఉంటుందని ఆశిస్తున్నాను.

తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను విడుదల చేయడానికి అవకాశం ఇచ్చిన నిర్మాత ఎస్‌.ఆర్‌. ప్రభుకి థ్యాంక్స్‌’’ అన్నారు రాధామోహన్‌. ‘‘సూర్య అద్భుతంగా నటించారు. సాయిపల్లవి, రకుల్‌ప్రీత్‌సింగ్‌ మంచి నటీమణులు. యువన్‌తో సహా టీమ్‌ అందరికీ థ్యాంక్స్‌’’ అన్నారు శ్రీరాఘవ. ‘‘సూర్య తమిళ హీరో అయినప్పటికీ మన తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తారు. ఈ సినిమా మంచి హిట్‌ కావాలి. రాధామోహన్‌గారికి పెద్ద సెక్సెస్‌గా నిలవాలి’’ అన్నారు నిర్మాత అనిల్‌ సుంకర. ‘‘యూనిట్‌కి ఆల్‌ ది బెస్ట్‌. సినిమా విజయం సాధించాలి’’ అన్నారు నిర్మాత భోగవల్లి బాపినీడు.

‘‘తెలుగులో పెద్ద హీరో సినిమా వస్తుంటే ఎలా వెయిట్‌ చేస్తున్నారో.. సూర్యగారి సినిమా అంటే అంతే వెయిట్‌ చేస్తున్నారు. ఈ సినిమా సక్సెస్‌ కావాలి’’ అన్నారు నిర్మాత మిర్యాల రవీందర్‌రెడ్డి. ట్రైలర్‌ అద్భుతంగా ఉంది. సినిమా కూడా సూపర్‌హిట్‌ అవుతుంది’’ అన్నారు నిర్మాత రామ్‌ తాళ్లూరి. ‘‘హైదరాబాద్‌కు వస్తే ఇంటికి వచ్చిన ఫీలింగ్‌ ఉంటుంది. ఈ సినిమాతో చాలా నేర్చుకున్నాను. సూర్యగారు, రాఘవగారు.. ఇలా టీమ్‌ అందరూ నాకు ఎంతో సపోర్ట్‌గా నిలిచారు’’ అన్నారు సాయిపల్లవి. ‘‘సూర్యగారు అమేజింగ్‌ అండ్‌ ప్రొఫెషనల్‌ యాక్టర్‌. ఆయనతో వర్క్‌ చేయడం హ్యాపీ’’ అన్నారు రకుల్‌ప్రీత్‌ సింగ్‌. కెమెరామేన్‌ శివకుమార్‌ విజయన్‌ మాట్లాడారు.

మరిన్ని వార్తలు