గోపాలా పోరా నాన్నా...

15 Feb, 2019 06:27 IST|Sakshi

యువత రాజకీయాల్లోకి వస్తే దేశప్రగతికి మంచిదని మేధావులు అంటుంటారు. కానీ రాజకీయాలు అంత ఈజీ కాదు. పక్కనున్నవాడు శత్రువో, మిత్రుడో ప్రమాదం జరిగిన తర్వాత కానీ తెలీదు. మరి.. ఇలాంటి రాజకీయాల్లోకి దిగిన నంద గోపాలకృష్ణ అనే యువకుడు రాజకీయ చదరంగాన్ని ఎలా ఆడాడు అనే నేపథ్యంలో రూపొందిన పొలిటికల్‌ థ్రిల్లర్‌ మూవీ ‘ఎన్‌జీకే: నంద గోపాల కృష్ణ’. సూర్య హీరోగా నటించిన ఈ చిత్రంలో రకుల్‌ప్రీత్‌సింగ్, సాయిపల్లవి కథానాయికలుగా నటించారు.

శ్రీ రాఘవ దర్శకత్వంలో ఎస్‌.ఆర్‌. ప్రకాష్‌ బాబు, ఎస్‌.ఆర్‌. ప్రభు నిర్మించారు. ఈ సినిమా టీజర్‌ను గురువారం విడుదల చేశారు. ‘నా పేరు నంద గోపాల కృష్ణ... ప్రజలు ఎన్‌జీకే అని పిలిస్తారు. నేర్చుకుంటా అయ్యగారు’ అని సూర్య చెప్పిన డైలాగ్స్‌తో పాటు... ‘‘గోపాలా పోరా నాన్నా.. నువ్వు దిగితే ఎలాంటి మురికైనా శుభ్రమవుతుంది’’ అని సాయిపల్లవి చెప్పిన డైలాగ్స్‌ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ సినిమా సమ్మర్‌లో విడుదల కానుందని తెలుస్తోంది.

మరిన్ని వార్తలు