వన్‌ డే టీచర్‌

6 Dec, 2019 07:21 IST|Sakshi

సర్కారు బడిలో నిధి అగర్వాల్‌ ఇంగ్లిష్‌ పాఠాలు  

బంజారాహిల్స్‌: టాలీవుడ్‌ హీరోయిన్‌ నిధి అగర్వాల్‌ టీచర్‌గా మారిపోయారు. విద్యార్థులకు ఇంగ్లిష్‌ పాఠాలు చెప్పి మెప్పించింది. సర్కారు బడుల్లో విద్యార్థులకు ఆంగ్ల పాఠాలు చెప్పేందుకు, వారిలో ఆంగ్ల నైపుణ్యాన్ని పెంపొందించేందుకు పెగా టీచ్‌ ఫర్‌ ఛేంజ్‌ స్వచ్ఛంద సంస్థ ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా గురువారం బంజారాహిల్స్‌ రోడ్‌ నెం:12లోని ఎన్‌బీటీనగర్‌ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నిధి ఇక్కడి మూడో తరగతి విద్యార్థులకు గంట సమయం ఇంగ్లిష్‌ పాఠాలు బోధించారు.

వారితో ఇంగ్లిష్‌లో మాట్లాడించారు. అనంతరం విద్యార్థులతో సెల్ఫీలు దిగి వారిని మరింత ఉత్సాహపరిచారు. ఇలాంటి బృహత్తర కార్యక్రమంలో తనను భాగస్వామ్యం చేయడం మరిపోలేనని ఆనందం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మాతృభాషతో పాటు ఇంగ్లిష్‌ నేర్పించడం ఎంతో అవసరమని, ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళుతున్న సంస్థను ఆమె అభినందించారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఇంగ్లిష్‌లో మాట్లాడేందుకు, వారిలో సృజనను పెంచేందుకు తాము ప్రముఖులతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పెగా సిస్టమ్స్‌ ఎండీ సుమన్‌రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో ఎంఆర్‌ఎస్‌కే ఫౌండర్‌ చైతన్య కూడా పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు