ఈ విజయానికి మూడు ప్రధాన కారణాలు

15 Dec, 2019 00:25 IST|Sakshi
రాజ్‌కుమార్‌ ఆకెళ్ళ, లావణ్యా త్రిపాఠి, ‘ఠాగూర్‌’ మధు, నిఖిల్, సంతోష్, సత్య

– నిఖిల్‌

‘‘మా సినిమాకు హెల్ప్‌ చేయడానికి దేవుడిలా వచ్చిన చిరంజీవిగారు, ప్రేక్షకుల మౌత్‌ టాక్, మీడియా సపోర్ట్‌... మా ‘అర్జున్‌ సురవరం’ చిత్రం విజయం సాధించడానికి ఈ మూడు ప్రధాన కారణాలు’’ అని అన్నారు నిఖిల్‌. టి. సంతోష్‌ దర్శకత్వంలో నిఖిల్, లావణ్యా త్రిపాఠి జంటగా బి.మధు సమర్పణలో రాజ్‌ కుమార్‌ ఆకెళ్ల నిర్మించిన చిత్రం ‘అర్జున్‌ సురవరం’. నవంబరు 29న విడుదలైన ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శించబడుతోందని చిత్రబృందం చెబుతోంది.

ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో నిఖిల్‌ మాట్లాడుతూ–‘‘మా సినిమాను నమ్మి, ప్రమోట్‌ చేసిన నిర్మాతలకు ధన్యవాదాలు. నటనలోనే కాదు.. ప్రమోషన్స్‌లోనూ కోపరేట్‌ చేసిన లావణ్యాత్రిపాఠికి ధన్యవాదాలు’’ అని అన్నారు. ‘‘ఎంతో కష్టపడ్డాం. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఫైనల్‌గా విజయం సాధించాం. సంతోషంగా ఉంది. ప్రేక్షకులకు ధన్యవాదాలు’’ అన్నారు సంతోష్‌.

‘‘మోసం విశ్వవ్యాప్తమైనప్పుడు నిజం చెప్పడం విప్లవాత్మకమైన చర్య అని జార్జ్‌ ఆర్వెల్‌ చెప్పిన కొటేషన్‌ ఈ సినిమాకు స్ఫూర్తి’’ అన్నారు రాజ్‌కుమార్‌. ఇంతటి ఘనవిజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు థ్యాంక్స్‌’’ అన్నారు లావణ్యా త్రిపాఠి. ‘‘అనుక్షణం సినిమా గురించి ఆలోచించే వ్యక్తి నిఖిల్‌. తనను చూసి చాలా నేర్చుకుంటున్నాను. ఈ సినిమా పెద్ద విజయం సాధించడం హ్యాపీ’’ అన్నారు నటుడు రాజ్‌ తరుణ్‌. నిర్మాతలు ‘ఠాగూర్‌’ మధు, సుధాకర్‌ రెడ్డి, ఏషియన్‌ సునీల్, అభిషేక్‌ అగర్వాల్‌ నటీనటులు సత్య, కేదార్‌ శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు