ప్రత్యేక హోదా వల్లే ఏపీ అభివృద్ధి: నటుడు

5 Feb, 2018 09:27 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: కొన్ని ప్రత్యేకమైన విషయాలపై స్పందించడానికి కేవలం రాజకీయ నాయకులు మాత్రమే కానక్కర్లేదని టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ అభిప్రాయపడ్డారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్‌కి నిరాశే ఎదురవడంతో నటుడు నిఖిల్ తన వంతుగా గళం విప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నానని, అది ప్రత్యేక హోదాతో పాటు కేంద్రం నిధుల వల్ల మాత్రమే సాధ్యం అవుతుందని పేర్కొన్నారు. కొందరు తనను 'నీకు ఏపీకి ప్రత్యేక హోదా' లాంటి విషయాలు ఎందుకంటూ ప్రశ్నిస్తున్నారని తెలిపారు. సోషల్ మీడియాలో దీనిపై నిఖిల్ స్పందిస్తూ ట్వీట్ చేశారు.

'ఏపీకి ప్రత్యేక హోదా సాధించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కేంద్ర నుంచి రాష్టానికి ప్రత్యేక సాయం అందాలన్నా, ఏపీలో మరింత అభివృద్ధి జరగాలన్నా హోదాతోనే సాధ్యమవుతుందని తెలుసుకున్నాను. కొంత మంది ఇలాంటి విషయాలు నీకెందుకని ప్రశ్నిస్తున్నారు. తెలుగు వ్యక్తిగా, ఓ భారతీయుడిగా అభివృద్ధి కోరుకుంటున్నాను. కేంద్ర ప్రభుత్వం నుంచి భారీ నిధులు వచ్చినప్పుడే ఏపీలో అభివృద్ధికి ఆస్కారం ఉంటుందని' నటుడు నిఖిల్ తన ట్వీట్లో రాసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తుందంటూ ఓ ఫొటోను పోస్ట్ చేశారు. ఆయన నటించిన లేటెస్ట్ మూవీ కిర్రాక్ పార్టీ విడుదలకు సిద్ధంగా ఉంది.

మరిన్ని వార్తలు