ఇది సినిమా కాదు.. ఒక అనుభవం

1 Dec, 2019 03:43 IST|Sakshi
లావణ్య, నిఖిల్, టి. సంతోష్, ‘ఠాగూర్‌’ మధు, రాజ్‌కుమార్‌ ఆకెళ్ల, నాగినీడు

– నిఖిల్‌

‘‘ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాల్లో ‘అర్జున్‌ సురవరం’ హాట్‌ టాపిక్‌ అయింది. ఈ సినిమా చేస్తున్నప్పుడు నేను, మా డైరెక్టర్‌ సంతోష్‌ వాదించుకునేవాళ్లం. ఈ సక్సెస్‌ తనదే. ఈ విజయం నా ముఖంలో నవ్వు తెచ్చింది’’ అని నిఖిల్‌ అన్నారు. టి. సంతోష్‌ దర్శకత్వంలో నిఖిల్, లావణ్యా త్రిపాఠి జంటగా నటించిన చిత్రం ‘అర్జున్‌ సురవరం’. ‘ఠాగూర్‌’ మధు సమర్పణలో రాజ్‌కుమార్‌ ఆకెళ్ల నిర్మించారు. తమిళ చిత్రం ‘కణిదన్‌’కి తెలుగు రీమేక్‌గా ఈ సినిమా రూపొందింది. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా సక్సెస్‌ మీట్‌ను శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసింది చిత్రబృందం.

ఈ సందర్భంగా నిఖిల్‌ మాట్లాడుతూ – ‘‘ఈ సినిమా తొలి రోజు 4.1 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసింది. ‘అర్జున్‌ సురవరం’ సినిమా కాదు.. ఒక అనుభవం. మీడియా పవర్‌ చూపించే సినిమా. ఈ సినిమా వల్ల మా టీమ్‌ అందరం గౌరవం పొందుతున్నాం. సినిమా కొన్న బయ్యర్స్, డిస్ట్రిబ్యూటర్స్‌ అందరూ హ్యాపీగా ఉన్నారు. అల్లు అరవింద్‌గారు పర్సనల్‌గా అభినందించారు. చిరంజీవిగారికి స్పెషల్‌ థ్యాంక్స్‌. రిలీజ్‌లు వాయిదా పడి హిట్‌ కొట్టిన సినిమాలు తక్కువ. మేం హిట్‌ సాధించాం’’ అన్నారు.

‘‘ఈ సినిమా చేయడానికి మా టీమ్‌ అందరం చాలా కష్టపడ్డాం. ఇంతమంచి సక్సెస్‌ అందించిన ఆడియన్స్‌కి థ్యాంక్స్‌. మా సినిమాను చూసి అభినందించిన చిరంజీవిగారికి ధన్యవాదాలు’’ అన్నారు రాజ్‌కుమార్‌ ఆకెళ్ల. ‘‘నేను రాసిన ప్రతీ సీన్‌ను తన నటనతో అద్భుతంగా ఎలివేట్‌ చేశాడు నిఖిల్‌. ‘ఠాగూర్‌’ మధు, రాజ్‌కుమార్‌గారికి థ్యాంక్స్‌’’ అన్నారు టి. సంతోష్‌. ‘‘పరీక్షలు రాసి చాలా రోజులు ఎదురు చూశాం. ఫైనల్‌గా ప్రేక్షకులు పాస్‌ అన్నారు. చాలా సంతోషం’’ అన్నారు నాగినీడు. ‘‘అనుకున్నదానికంటే ప్రేక్షకులు ఎక్కువ రెస్పాన్స్‌ అందించారు. దర్శకుడు చాలా కష్టపడ్డారు’’ అన్నారు లావణ్యా త్రిపాఠి.
 

మరిన్ని వార్తలు