ఓ పల్లవి... రెండు చరణాలు!

25 Jun, 2017 23:49 IST|Sakshi
ఓ పల్లవి... రెండు చరణాలు!

పాట పల్లవితో మొదలవుతుంది. పల్లవి వెంట చరణాలు వస్తాయి. అది తెలిసిందే. ‘నిన్ను కోరి’ అనే కవితాత్మక టైటిల్‌తో వస్తున్న సినిమా కథలో హీరోయిన్‌ నివేదా థామస్‌ పల్లవి అయితే.. ఆమెను రెండు చరణాలు వెంటాడతాయి.

మరి, ఆ చరణాలు ఎవరంటే... హీరోలు నాని, ఆది పినిశెట్టి. ఓ చరణం (నాని) విశాఖలో పల్లవి చదువుతున్నప్పుడు వెంట పడితే... రెండో చరణం (ఆది) అమెరికాలో ఉద్యోగం చేస్తున్నప్పుడు వెంట పడుతుంది. మరి, జీవితం చివరి వరకు ఏ చరణంతో అడుగులు వేయాలని పల్లవి నిర్ణయించుకుందనేది జూలై 7న ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమా చూసి తెలుసుకోమంటున్నారు నిర్మాత డీవీవీ దానయ్య. శివ నిర్వాణను దర్శకుడిగా పరిచయం చేస్తూ ఆయన నిర్మించిన ఈ సినిమా ఆ రోజే విడుదల కానుంది. ఈ నెల 29న ఈ సినిమా ప్రీ–రిలీజ్‌ ఫంక్షన్‌ చేస్తున్నారు. అన్నట్టు... సినిమాలో హీరోయిన్‌ పేరు పల్లవి.

>