ఆశ్రమంలో గడిపొచ్చా!

5 Aug, 2019 06:58 IST|Sakshi

సినిమా: ఆశ్రమంలో గడిపొచ్చానని చెప్పింది నటి నిత్యామీనన్‌. ఏంటీ ఈ భామ ఆధ్యాత్మిక మార్గం పట్టిందా. అని అండిగేయకండి. తనకు నచ్చింది చేసే అరుదైన నటి నిత్యామీనన్‌. సినిమాలైనా తనకు నచ్చితే చిన్న పాత్రను చేయడానికైనా సిద్ధం అంటుంది. అలా అతిథి పాత్రల్లో నటించిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇటీవల బాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన నిత్యామీనన్‌ నటించిన మిషన్‌ మంగళ్‌ త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. ఇందులోనూ ఇద్దరు ముగ్గురు హీరోయిన్లలో ఒకరిగా నటించింది. ఇక కోలీవుడ్‌లో జయలలిత బయోపిక్‌గా తెరకెక్కనున్న ది ఐరన్‌ లేడీ చిత్రంలో నటించడానికి రెడీ అవుతోంది. అదేవిధంగా సైకో అనే చిత్రంతో పాటు ఒక మలయాళ చిత్రంలోనూ నటిస్తూ బిజీగా ఉంది. అలాంటి నిత్యామీనన్‌ ఒక ఇంటర్వ్యూలో వారం రోజులపాటు ఆశ్రమంలో గడిపినట్లు చెప్పింది. అలా ఎందుకు గడపాల్సి వచ్చిందన్నది చెప్పలేదు గానీ అక్కడ మతం గురించి నేర్చుకోలేదు గానీ, నా గురించి నేను తెలుసుకున్నానని చెప్పింది.

పాఠాలు నేర్పడానికి చాలా కళాశాలలు ఉన్నాయి. మనుషులైన మన గురించి ఏ కళాశాలల్లోనూ చెప్పడం లేదు అని అంది. ఇకపోతే నటిగా తన గురించి చెప్పాలంటే తాను నటించే పాత్రల కోసం ముందుగా ఎలాంటి శిక్షణ తీసుకోనని చెప్పింది. ఇంకా చెప్పాలంటే ఎలాంటి పాత్రనైనా కష్టపడి నటించను. షూటింగ్‌ స్పాట్‌కు వెళ్లిన తరువాత అక్కడ యూనిట్‌ వాళ్లు ఇచ్చిన దుస్తులు ధరించగానే నిత్యామీనన్‌ అన్న విషయాన్ని మరిచి ఆయా పాత్రలుగా మారిపోతానని చెప్పింది. సాధారణంగా తాను నటించాల్సిన సీన్‌ పేపర్లను, సంభాషణలను చివరి నిమిషంలోనే ఇస్తుంటారు. కొందరైతే ఉదయాన్నే ఇస్తారని చెప్పింది. అయితే చిత్ర కథను విన్నప్పుడే తన పాత్ర మదిలో నిలిచిపోతుందదని చెప్పింది. దాంతో పాత్రలో ఒదిగిపోతానని అంది. ఒక్కో సమయంలో సన్నివేశాలను దర్శకులు మారుస్తుంటారంది. అప్పుడు తాను ముందు చెప్పిన సన్నివేశాలు లేవే అని తాను అడిగితే వారు ఆశ్చర్యపోతుంటారని చెప్పింది. ప్రస్తుతం ది ఐరన్‌ లేడీ చిత్రంలో నటించడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు నిత్యామీనన్‌ పేర్కొంది.

మరిన్ని వార్తలు