ఆ వ్యక్తితో కలిసి జీవించలేనని విడిపోయా

22 Jun, 2016 02:20 IST|Sakshi
ఆ వ్యక్తితో కలిసి జీవించలేనని విడిపోయా

సంచలన తారల్లో నటి నిత్యామీనన్ ఒకరని చెప్పవచ్చు. ఆమె కూడా ఏ విషయం గురించి అయినా చాలా బోల్డ్‌గా మాట్లాడతారు. కాస్త హైట్ తక్కువైనా వెయిట్ అయిన నటిగా పేరు తెచ్చుకున్న నిత్యామీనన్ తనకు పాత్ర నచ్చితే దాని పరిధి గురించి అసలు ఆలోచించరు. అలా చాలా చిత్రాల్లో రెండో హీరోయిన్‌గానూ నటించారు. ప్రస్తుతం తమిళంలో విక్రమ్‌కు జంటగా ఇరుముగన్ చిత్రంలో, తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ సరసన ఒక చిత్రంలోనూ నటిస్తున్నారు.
 
సుధీప్‌తో నటించిన ముడింజా ఇవనైపిడి చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. నిత్యామీనన్ తన గురించి ఏమంటున్నారో చూద్దాం.మంచి కథా చిత్రాలలో నటనకు అవకాశం ఉన్న పాత్రల్లో నటించి మంచి పేరు తెచ్చుకోవాలన్నదే నా కోరిక.డబ్బు సంపాదించాలని ఆ రంగంలోకి రాలేదు. నాకు పాఠశాలలో చదువుకునే సమయంలోనే పాటలపై ఆసక్తి. స్కూల్ డేస్‌లో సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేదానిని. అవే నాకు సినిమా అవకాశాలు కల్పించాయి. తొలి సారిగా నటి టబుకు చెల్లెలిగా నటించాను.అందుకు 50 వేలు పారితోషికం ఇచ్చారు.

ఇక ప్రేమ విషయానికి వస్తే కాలేజీ రోజుల్లోనే ఒక వ్యక్తి ప్రేమలో పడ్డాను.అయితే ఆ వ్యక్తితో కలిసి జీవించలేనని గ్రహించి విడిపోయాను. నాన్న నాస్తికుడు. అందుకని అమ్మ ఇంట్లో పూజలు చేయడం మానేశారు. నాకు దైవభక్తి మెండు. నాన్న నన్ను గుడికి తీసుకెళ్లేవారు. అయితే నేను దైవ దర్శనం చేసుకుని వచ్చే వరకూ నాన్న గుడి బయట వేచి ఉండేవారు. నాది ఉన్నది ఉన్నట్లు మాట్లాడే మనస్థత్వం. నాకు మనసులో అనిపించింది బయటకు చెప్పేస్తాను. కొందరు నన్ను అదో మాదిరి అంటుంటారు.అలాంటి మాటలు బాధను కలిగిస్తాయి.షూటింగ్ సమయంలో నా సన్నివేశాల చిత్రీకరణ పూర్తి అయితే పక్కన కూర్చుని ఇతర నటీనటుల నటనను పరిశీలిస్తాను. లేదా ధ్యానం చేసుకుంటాను.