బంధం ముగిసింది.. విడిపోతున్నాం: నటి

14 May, 2020 15:13 IST|Sakshi

బ్రేకప్‌ చెప్పుకొన్న సెలబ్రిటీ జంట

ప్రియుడు శంతను మహేశ్వరితో తన ప్రేమబంధం ముగిసిపోయిందని నటి నిత్యామీ శ్రికే తెలిపారు. ప్రేమికులుగా విడిపోయినప్పటికీ స్నేహితులుగా ఎల్లప్పుడూ కలిసే ఉంటామని స్పష్టం చేశారు. కాగా పలు టీవీ షోల్లో మెరిసిన నిత్యామీ.. నటుడు శంతనుతో కలిసి మెడికల్లీ యువర్స్‌ అనే వెబ్‌ సిరీస్‌లో నటించారు. ఈ క్రమంలో వారి మధ్య ఏర్పడిన స్నేహం ప్రేమకు దారి తీసింది. ఇక డాన్స్‌ రియాలిటీ షో నచ్‌ బలియే 9లో జంటగా పాల్గొన్న వీరిద్దరు అదే స్టేజ్‌పై తాము ప్రేమలో ఉన్నట్లు ప్రకటించారు. అయితే ఏడాది తిరగకుండానే తమ మధ్య బంధం ముగిసినట్లు ప్రకటించి అభిమానులను ఆశ్చర్యపరిచారు. ఈ విషయం గురించి నిత్యామీ మాట్లాడుతూ.. ‘‘ఏప్రిల్‌ 2019లో ఓ వెబ్‌ సిరీస్‌ షూటింగ్‌ సమయంలో శంతనును కలిశాను. అందులో మేమిద్దరం జంటగా నటించాం. ఒకరి గురించి ఒకరం తెలుసుకున్నాం. (మా కుటుంబంలోకి స్వాగతం రానా: సోనం కపూర్‌)

ఇక నచ్‌ బలియే షో కారణంగా దాదాపు ఐదు నెలల పాటు ఒకేచోట ఉండాల్సి వచ్చింది. అలా మా బంధం మొదలైంది. ఇప్పుడు కూడా మా ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవు. అయితే మేం స్నేహితులుగా మాత్రమే కలసి ఉండగలమనే అభిప్రాయానికి వచ్చాం. అందుకే ఫిబ్రవరిలో బ్రేకప్‌ చెప్పుకొన్నాం. ఏదేమైనా మంచి స్నేహితుడిగా శంతనుకు నా జీవితంలో ఎల్లప్పుడూ స్థానం ఉంటుంది’’అని చెప్పుకొచ్చారు. కాగా ప్రేమలో విఫలమైన నిత్యామీ తన తల్లిదండ్రులను కలుసుకునేందుకు మెల్‌బోర్న్‌ వెళ్లిపోయారు. కోవిడ్‌ వ్యాప్తి నేపథ్యంలో ప్రస్తుతం సెల్ఫ్‌ క్వారంటైన్‌లో ఉన్నారు. తనకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు. ఇక శంతను నటుడిగానే కాకుండా కొరియోగ్రాఫర్‌, హోస్ట్‌గా అలరిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నాడు. (తన పెళ్లి వార్తలపై స్పందించిన సాయి పల్లవి)

మరిన్ని వార్తలు