మళ్లీ నటన వైపు..

30 Apr, 2018 09:22 IST|Sakshi

తమిళసినిమా: బాలనటిగా పరిచయమై కథానాయ కి స్థాయికి ఎదిగిన నటీమణుల్లో నివేదా థామస్‌ ఒకరు. బాల తారగా సుమారు పుష్కరం కాలం పాటు నటించి ఈ మధ్యనే నాయకిగా ప్రమోట్‌ అయిన ఈ కేరళా కుట్టి మలయాళం, తమిళం, తెలుగు భాషల్లో గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈ మూడు భాషల్లో హీరోయిన్‌ చాన్స్‌ కొట్టేసింది మాత్రం టాలీవుడ్‌నే. మాలీవుడ్‌లో 2003లోనే బాలనటిగా రంగప్రవేశం చేసిన నివేదా థామస్‌ కోలీవుడ్‌లో కాదల్‌కణ్మణి, 24, కాంచన 2, మెర్శల్‌ వంటి చిత్రాల్లో చెల్లెలి పాత్రల్లో నటించిన నివేదాథామస్‌ తెలుగులో జెంటిల్‌మెన్‌ చిత్రంతో హీరోయిన్‌గా అవకాశం దక్కించుకుంది. అక్కడ వరుసగా నిన్నుకోరి, జై లవకుశ, జూలియట్‌ లవర్‌ ఆఫ్‌ ఇడియట్‌ వంటి చిత్రాల్లో నటించింది. ఇలాంటి తరుణంలో చదువు కోసం చిన్న బ్రేక్‌ తీసుకున్న నివేదా థామస్‌ ఇప్పుడు పరిక్షలు రాసేసి మళ్లీ నటనపై దృష్టి సారించిందట.

కమహాసన్‌ చిత్రం పాపనాశం చిత్రంలో ఆయనకు కూతురుగా నటించి మంచి పేరు తెచ్చుకున్న ఈ అమ్మడు ఇప్పుడు వ్యాయామ కసరత్తులే, ఆహారపు కట్టుబాట్లు పక్కన పెట్టడంతో బాగా లావెక్కిందట. తాజాగా ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి చెన్నైకి వచ్చిన నివేదా థామస్‌ను చూసిన అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఇదే విధంగా ఆహార నియమాలను పాటించక బరువు పెరిగిన నటి నిత్యామీనన్‌కు చాలా అవకాశాలు దూరం అయ్యాయి. అయితే నిత్యామీనన్‌ ఆ అవకాశాలు పోయినా చింత లేదని తెగేసి చెప్పింది. కానీ నివేదాథామస్‌ పరిస్థితి వేరు. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న నటి. కోలీవుడ్‌లో ఇంకా కథానాయకిగా నటించే అవకాశమే అందుకోలేదు. ప్రస్తుత రోజుల్లో సన్నగా, నాజుగ్గా ఉన్న హీరోయిన్‌లకే క్రేజ్‌. ఈ విషయాన్ని గ్రహించి నివేదాథామస్‌ బరువు తగ్గితే మంచిదేనే అభిప్రాయం సినీ వర్గాల్లో వ్యక్తం అవుతోంది.

మరిన్ని వార్తలు