బిజీ బిజీగా నివేదా

4 Jun, 2019 09:52 IST|Sakshi

ఇప్పుడు చేతినిండా చిత్రాలున్న అతి తక్కువ మంది హీరోయిన్లలో నటి నివేదాపేతురాజ్‌ ఒకరు. ఒరునాళ్‌ కూత్తు చిత్రంతో సినీరంగప్రవేశం చేసిన దుబాయ్‌ వాసి అయిన ఈ తమిళ అమ్మాయి.. ఆ తరువాత జయంరవికి జంటగా నటించిన టిక్‌ టిక్‌ టిక్‌ వంటి కొన్ని విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు. అలాంటిది 2019 నివేదా కేరీర్‌లో గుర్తుండిపోయే సంవత్సరంగా మిగిలిపోతుందని చెప్పవచ్చు. కారణం ఈ ఏడాదిలో అరడజనుకు పైగా చిత్రాల్లో నాయకిగా నటిస్తూ బిజీ బిజీగా ఉండటమే.

తెలుగులోనూ వరుససినిమాలతో బిజీ అవుతున్నారు నివేదా. తమిళ్‌లో ఈ బ్యూటీ వెంకట్‌ప్రభు దర్శకత్వంలో నటించిన పార్టీ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఇప్పుడు ప్రభుదేవాతో పొన్‌ మాణిక్యవేల్, విష్టు విశాల్‌ సరసన జగజాల కిల్లాడి, విజయ్‌సేతుపతికి జంటగా సంఘతమిళన్‌ చిత్రాలతో బిజీగా ఉన్నారు. వీటితో పాటు వాన్‌ అనే మరో చిత్రం నివేదా చేతిలో ఉంది.

తాజాగా మాఫియా అనే చిత్రంలో నటుడు అరుణ్‌ విజయ్‌తో రొమాన్స్‌ చేయడానికి రెడీ అవుతున్నారు. ఇంతకుముందు ధృవంగళ్‌ 16 చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యి సంచలన విజయాన్ని అందుకున్న యువ దర్శకుడు నరేన్‌ తదుపరి అరవిందస్వామి, సందీప్‌కిషన్, శ్రియలతో నరకాసురన్‌ చిత్రాన్ని తెరకెక్కించారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆర్థిక సమస్యల కారణంగా ఇంకా విడుదల కాలేదు.

తదుపరి నటుడు పార్తీపన్‌ హీరోగా నాటక మేడై అనే చిత్రాన్ని రూపొందించాలని ప్రకటన కూడా విడుదల చేసిన నరేన్‌ దాని నిర్మాణాన్ని పక్కన పెట్టి తాజాగా మరో చిత్రానికి సిద్ధం అయ్యారు. అరుణ్‌ విజయ్‌ హీరోగా మాఫియా అనే టైటిల్‌తో గ్యాంగ్‌స్టర్‌ చిత్రం చేయనున్నారు. ఇందులో నటి నివేదా పేతురాజ్‌ను హీరోయిన్‌గా ఎంచుకున్నారు. ఈ చిత్రం త్వరలోనే సెట్‌పైకి వెళ్లనుంది.

మరిన్ని వార్తలు