ఆయన నాకు చాలా నేర్పించారు: నివేద

8 Aug, 2017 21:46 IST|Sakshi
ఆయన నాకు చాలా నేర్పించారు: నివేద

చెన్నై: నటి నివేదా పేతురాజ్‌ ఇప్పుడు ఒక రకమైన ఎగ్జైట్‌మెంట్‌, టెన్షన్‌తో ఉంది.  దానికి కారణం కోలీవుడ్‌లో తను నటించిన రెండో చిత్రం పొదువాగ ఎన్‌ మనసు తంగం చిత్రం శుక్రవారం విడుదల కానుంది. ఉదయనిధి స్టాలిన్‌ సరసన కథానాయకిగా నటించిన ఈ చిత్రంలో నటుడు పార్తీపన్‌ ప్రధాన పాత్రను పోషించారు. తేనాండాళ్‌ ఫిలింస్‌ లిమిటెడ్‌ పతాకంపై ఎన్‌.రామస్వామి నిర్మించిన ఈ చిత్రానికి దళపతి ప్రభు దర్శకుడు. ఒరునాళ్‌కూత్తు చిత్రం తరువాత నటి నివేదా పేతురాజ్‌ హీరోయిన్‌గా నటించిన రెండో తమిళ చిత్రం పొదువాగ ఎన్‌ మనసు తంగం.

ఇందులో తన అనుభవం గురించి చెపుతూ, ఉదయనిధి స్టాలిన్‌కు జంటగా నటించడం మంచి అనుభవం అని పేర్కొంది. అయితే ఇందులో నటుడు పార్తీపన్‌కు కూతురుగా నటించినట్లు చెప్పింది. ఆయన నటన గురించి నాకు చాలా నేర్పించారనీ తెలిపింది. పార్తిపన్‌ తనకు తండ్రిగా నటిస్తున్నారని దర్శకుడు చెప్పగానే సంతోషం కలిగినా, కాస్త భయం అనిపించిందని అంది. కారణం ఆయన చాలా సీనియర్‌ దర్శకుడు కావడమేనంది. ఈ చిత్రం తుది ఘట్ట సన్నివేశాల్లో నటించడానికి తటపటాయిస్తున్నప్పుడు పార్తీపన్‌ ఎలా నటించాలో చెప్పి ధైర్యాన్ని నింపారని చెప్పింది. పొదువాగ ఎన్‌ మనసు తంగం చిత్రంలో తాను ఏ మాత్రం బాగా చేశానని అభినందనలు లభిస్తే ఆ క్రెడిక్ట్‌ అంతా పార్తీపన్‌కే దక్కుతుందని నివేదా పేర్కొంది. కాగా ఈ బ్యూటీ తాజాగా నటుడు జయంరవికి జంటగా టిక్‌ టిక్‌ టిక్‌ చిత్రంలో నటిస్తోంది.