నేనూ దొంగతనం చేశాను..

10 Dec, 2019 08:23 IST|Sakshi

తానూ దొంగతనానికి పాల్పడినట్లు నివేదాపేతురాజ్‌ చెబుతోంది. పుట్టింది చెన్నైలోనేనైనా, బాల్యం అంతా దుబాయ్‌లో గడిపిన ఈ భామ మొదట మోడలింగ్‌ రంగాన్ని ఎంచుకుని ఆ తరువాత సినీ నటిగా రంగప్రవేశం చేసింది. అలా ఒరునాళ్‌ కూత్తు చిత్రం ద్వారా కోలీవుడ్‌కు హీరోయిన్‌గా పరిచయం అయిన నివేదా పేతురాజ్‌ ఈ తరువాత పొదువాగ ఎన్‌ మనసు తంగం, టిక్‌ టిక్‌ టిక్, తిమిరు పిడిచ్చవన్‌ వంటి చిత్రాలతో గుర్తింపు పొందింది. ఇటీవల విజయ్‌సేతుపతితో నటించిన సంఘ తిమిళన్‌ చిత్రంలో కనిపించింది తక్కువే అయినా నటనతో తనదైన ముద్ర వేసుకుంది. కాగా ఈ చిన్నది వెంకట్‌ప్రభు దర్శకత్వంలో నటించిన పార్టీ, ప్రభుదేవాకు జంటగా నటించిన పొన్‌ మాణిక్యం చిత్రాలు త్వరలో విడుదలకు సిద్ధం అవుతున్నాయి.

జగజాల కిల్లాడీ చిత్రంలో నటిస్తున్న నివేదాపేతురాజ్‌ టాలీవుడ్‌లోనూ నటిస్తూ బహుభాషా నటిగా రాణిస్తోంది. కాగా ఈ అమ్మడు సామాజిక మాధ్యమాల ద్వారా తరచూ అభిమానులతో ముచ్చటిస్తుంది. తాజాగా జరిగిన సంభాషణల్లో తన భావాలు వెల్లడించారు. అభిమానులు తమ బాల్యంలో జరిగిన సంఘటనలను ఆమెతో పంచుకుని సంతోష పడ్డారు. వారిలో కొందరి ముచ్చట్లను నివేదా పేతురాజ్‌ తన ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్‌ చేసింది. అందులో ఒక అభిమాని పాఠశాలలో చదువుకునేటప్పుడు చాక్‌పీస్‌లను దొంగిలించేవాడినని చెప్పాడు. అందుకు స్పందించిన నివేదా చిన్నతనంలో తనకూ అలాంటి అలవాటు ఉండేదనిచెప్పింది. చాక్‌పీస్‌లను దొంగిలించి అమ్మకు ఇచ్చి ముగ్గులు వేయమనేదాన్ని అని అంది.

మరో అభిమాని చిన్నతనంలో రాత్రి వేళ కరెంట్‌ పోయినప్పుడు చుట్టు పక్కన ఉండే పిల్లలతో కలిసి కథలు చెప్పుకోవడం, ఆటలాడుకోవడం వంటివి చేసే వాడినని చెప్పాడు. అందుకు నివేదాపేతురాజ్‌ కూడా తానూ అలాంటి ఆటలు ఆడేదాన్నని వెల్లడించింది. కరెంట్‌ పోయినప్పుడు ఇతర పిల్లల ముఖాలపై టార్చిలైట్‌ వేసి భయపెట్టేదాన్ని అని చెప్పింది. అలా చిన్న నాటి ముచ్చటలను తన అభిమానులతో పంచుకుని వారిని ఆనందంలో ముంచెత్తిన నివేదాపేతురాజ్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అభిమానులతో చక్కగా ముచ్చటించే నివేదా పేతురాజ్‌ శభాష్‌ అంటూ పొగిడేస్తున్నారు.

మరిన్ని వార్తలు