యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్కు పెద్ద చిక్కొచ్చిపడింది. సినిమా అప్డేట్ ఏదీ? అంటూ అభిమానులు సోషల్ మీడియాలో డార్లింగ్ను నిలదీస్తున్నారు. రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఓ పీరియాడికల్ లవ్స్టోరీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, గోపీ కృష్ణ మూవీస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా ఫస్ట్ లుక్ను త్వరలోనే విడుదల చేస్తామని దర్శకుడు రాధాకృష్ణ అప్పట్లోనే ప్రకటించాడు. దీంతో ఉగాదికి సినిమా అప్డేట్ వస్తుందేమోనని అభిమానులు ఒళ్లంతా కళ్లు చేసుకుని ఎదురుచూడగా వారి ఆశలు అడియాశలే అయ్యాయి. దీంతో చిర్రెత్తుకొచ్చిన అభిమానులు యూవీ క్రియేషన్స్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ బ్యానర్ను నిషేధించాలంటూ #BanUVCreationsను ట్రెండ్ చేశారు. యూవీ(UV) అంటే "అప్డేట్స్ ఉండవు" అని అర్థం అంటూ సెటైర్లు విసిరారు.(డార్లింగ్ ఈజ్ బ్యాక్)
దీంతో స్పందించిన యూవీ క్రియేషన్స్ అప్డేట్స్ ఆలస్యమవుతున్నందుకు గల కారణాలను వివరించింది. ఈ మేరకు ట్విటర్లో.. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి వల్ల చాలామంది ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయని విచారం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సినిమా పనులన్నీ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఈ పరిస్థితి పూర్తిగా సద్దుమణిగిన తర్వాత మరెన్నో అప్డేట్స్ను పంచుకుంటామని పేర్కొంది. అప్పటివరకు అందరూ ఓపిక పట్టాలని కోరింది. ప్రతి ఒక్కరు ఇంట్లో ఉంటూ తాము సురక్షితంగా ఉండటంతోపాటు దేశాన్ని కాపాడాలని కోరుతూ ట్వీట్ చేసింది. ఈ నిర్ణయాన్ని అందరూ సమర్థిస్తున్నప్పటికీ ప్రభాస్ అభిమానులు మాత్రం పెదవి విరుస్తున్నారు.(అల్లు అర్జున్, విజయ్ డైట్ తెలుసుకోవాలి: హృతిక్)