కన్నుగీటి.. నా కేరీర్‌ నాశనం చేసింది

23 Feb, 2019 15:13 IST|Sakshi

సొగసుగా కన్నుకొట్టి.. కుర్రకారును తన వైపు తిప్పుకున్న ప్రియా ప్రకాష్ వారియర్ ఎంత పాపులారిటీ సంపాదించిందో తెలిసిందే. ఆ వీడియోతో రాత్రికి రాత్రి సెలబ్రిటీగా మారిపోయింది. అయితే ఈ వీడియోనే తన కేరీర్‌ను గందరగోళంలో పడేలా చేసిందని అంటోంది మరో హీరోయిన్‌. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ప్రియా వారియర్, నూరిన్ షెరిఫ్, రోషన్‌ హీరో హీరోయిన్లుగా నటించిన ‘ఒరు అడార్‌ లవ్‌’ రొమాంటిక్ మూవీని ‘లవర్స్ డే’ పేరుతో తెలుగులో ఫిబ్రవరి 14న విడుదల చేసిన విషయం తెలిసిందే. అన్నీ అనుకున్న‌ట్లు జ‌రిగి ఉంటే ఇప్పుడు ప్రియా వారియర్‌కు వ‌చ్చిన ఇమేజ్ మొత్తం మరో భామ‌ నూరిన్ షెరిఫ్ రావాల్సి ఉండేదట. 

ఈ విషయాలని నూరిన్ స్వయంగా ఓ ఇంటర్వూలో చెప్పింది. ప్రియా ప్రకాష్‌ని ఉద్దేశిస్తూ నూరిన్‌ చేసిన కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి. నిజానికి ముందుగా సినిమాలో లీడ్ క్యారెక్టర్‌గా నూరిన్‌ని అనుకున్నారట. కథ మొత్తం ఆమె చుట్టూ తిరిగేలా స్క్రిప్ట్ కూడా రాసుకున్నారట. కానీ, కన్నుకొట్టే సీన్‌తో ప్రియా ప్రకాష్ సెన్సేషనల్‌గా మారడంతో కథ మొత్తం మార్చేసి, ప్రియా పాత్రకు ప్రాధాన్యతనిస్తూ నూరిన్ రోల్ తగ్గించేశారట. ప్రియా వారియర్ సెన్సేషనల్‌గా మారిన తరువాత తనను పక్కన పెట్టారని వాపోయింది. ఆ కారణంగా ఎంతో ఆవేదనకు గురైనట్లు చెప్పింది. నిజానికి అంతా త‌న‌ను సెకండ్ హీరోయిన్ అనుకుంటున్నారని, కానీ తానే సినిమాలో మొద‌టి హీరోయిన్ అని చెబుతుంది. చిత్ర హీరో రోషన్ అబ్దుల్‌తో మళ్లీ నటించాల్సి వస్తే ఆనందంగా ఒప్పుకొంటాను. ప్రియా వారియర్‌తో నటించాల్సి వస్తే ఒకటికి పదిసార్లు ఆలోచిస్తాను. వీలైనంత వరకు ఒప్పుకోకుండానే ఉంటాను. ఎందుకంటే నా కెరీర్‌ను ఆమె గందరగోళంలో పడేసింది అని నూరీన్ ఆవేదన వ్యక్తం చేశారు.

కాగా, విడుదలకు ముందే ఏ మళయాళ చిత్రానికి లేని క్రేజ్ ‘ఒరు అడార్‌ లవ్‌’‌కి ఏర్పడింది. కన్నుకొట్టిన వీడియోతో ప్రపంచ వ్యాప్తంగా క్రేజీ హీరోయిన్‌గా మారిన ప్రియా వారియర్ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. దీనికి తోడు ఈ మూవీ టీజర్‌లో ఘాటైన ముద్దు సన్నివేశాల్లో రెచ్చిపోయి నటించి సినిమాపై అంచనాలు పెంచేసింది ప్రియావారియర్‌. సినిమాలో విషయం లేకపోవడంతో ప్రేక్షకుల్ని నిరుత్సాహ పరిచింది. అయితే జరగాల్సిన నష్టం జరిగిపోయిన తరువాత ఈ మూవీ క్లైమాక్స్‌ని మార్చుతున్నట్టు అధికారికంగా ప్రకటించింది చిత్ర యూనిట్. ఈ చిత్రంలో క్లైమాక్స్ విషాదాంతంగా ముగుస్తుంది. దీన్ని మార్పు చేసి కొత్తగా సన్నిశాలని రీషూట్ చేసి యాడ్ చేయబోతున్నారట. 10 నిమిషాల పాటు ఉండే ఈ సన్నివేశం సినిమాకి హైప్ తీసుకువచ్చేదిగా ఉంటుందని యూనిట్ భావిస్తోంది.

మరిన్ని వార్తలు