మా విడాకులకి ఆమె కారణం కాదు: దియామిర్జా

2 Aug, 2019 17:06 IST|Sakshi

సాక్షి, ముంబై: తన భర్త సాహిల్‌ సంగాతో విడాకులు తీసుకోవడానికి తమ మధ్య మూడో మనిషి కారణం కాదని నటి దియామీర్జా తెలిపింది. ఈ మేరకు మీడియాలో వస్తున్న వార్తలను ఆమె ట్విటర్‌ ద్వారా ఖండించింది. దాదాపు ఐదేళ్లు దంపతులుగా ఉన్న దియా- సాహిల్‌లు తాము ప్రయాణిస్తున్న దారులు వేర్వేరని, అందుకే విడిపోతున్నట్టు గురువారం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ విడాకులకి కారణం వీరి మధ్య మూడో మనిషి ఉండటమేనని స్థానిక పత్రిక ఒకటి కథనం​ ప్రచురించింది. దియా భర్తకు ఇటీవల విడుదలైన కంగనా రనౌత్‌ సినిమా జడ్జిమెంటల్‌ హై క్యా?కు రచయిత్రిగా పని చేసిన కనికా ధిల్లాన్‌తో సంబంధం ఉన్నట్లు ఇందులో రాసింది. ఈ వార్తతో మనస్తాపానికి గురైన దియా ఇవి నిరాధారమైనవని కొట్టిపారేసింది. అంతేకాక, కనికా ధిల్లాన్‌కు సారీ చెప్తూ ట్వీట్‌ చేసింది.

మరోవైపు కనికా స్పందిస్తూ.. ఇలాంటి సంబంధం లేని వార్తలను ఎలా రాస్తారంటూ ఆ పత్రికపై మండిపడింది. తన జీవితంలో ఇంతవరకు సాహిల్‌ను గానీ, దియాను గానీ కలవలేదని సోషల్‌మీడియా వేదికగా స్పష్టం చేసింది. కనికా ధిల్లాన్‌ దర్శకేంద్రుడు రాఘవేందర్‌ రావు కోడలు. ఆయన కొడుకు ప్రకాశ్‌ కోవెలమూడితో వీరి వివాహం 2014లో జరిగింది. అయితే వీరు రెండేళ్ల కిందటే విడిపోయారని   ఇండియా టుడేలో వార్త వచ్చింది. ఈ విషయాన్ని వీరు ధృవీకరించకపోయినా జరుగుతున్న పరిణామాలు అవుననే అంటున్నాయి. ఈ నేపథ్యంలో ఇలాంటి వార్త రావడం గమనార్హం.

చదవండి: విడాకులు తీసుకున్న దర్శకేంద్రుడి కుమారుడు!?

>
మరిన్ని వార్తలు